హుజూర్నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి తన సమీప ప్రత్యర్థి పై 43,358 ఓట్ల భారీ మెజారిటీ తో గెలిచారు. అదే సమయంలో బీజేపీ అభ్యర్థి కోటా రామారావు కేవలం 2,639 ఓట్లు వచ్చాయి. ఇప్పటిదాకా తెలంగాణలో తదుపరి అధికారంలోకి వచ్చేది మేమే అని చెప్పుకునే బీజేపీ నేతలకు రియాలిటీ కనిపించింది.
అయితే ఇంకా వారు దానిని చూసే ఉద్దేశం లేనట్టుగా ఉంది. హుజూర్నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ డబ్బుతో గెలిచిందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. అసలు హుజూర్నగర్లో టీఆర్ఎస్ది గెలుపే కాదన్నారు. అయితే ఇది అహంకారం అనుకోవాలో లేక అజ్ఞానం అనుకోవాలో తెలియడం లేదని గులాబీ అభిమానులు విమర్శిస్తున్నారు.
కొంపతీసి బీజేపీదే అసలు గెలుపు అంటారా అని వారు ఎద్దేవా చేస్తున్నారు. అలాగే సంజయ్ కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై చేసిన వ్యాఖ్యల మీదకూడా స్పందించారు. కేసీఆర్ పుట్టకముందే ఆర్టీసీ ఉందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఉద్యమ సమయంలో ఆర్టీసీ ఎక్కడ ఉందని ఎందుకు అనలేదని ఆయన ప్రశ్నించారు.
కేసీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని.. ఆయన సంగతి తేలుస్తామని, ప్రగతి భవన్, ఫాంహౌస్ను స్వాధీనం చేసుకుంటామని బండి సంజయ్ అన్నారు. హుజూర్నగర్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి కోటా రామారావుకు వచ్చిన 2,639 ఓట్లు చూసి కూడా అధికారంలోకి వస్తాం, ప్రగతి భవన్, ఫాంహౌస్ను స్వాధీనం చేసుకుంటాం అని చెబుతున్నారంటే ఏమనుకోవాలి.