YS Jagan - Pawan Kalyanబీజేపీ ప్రణాళికలో భాగంగానే జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ టీడీపీ పైన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ పైన విమర్శలు చేస్తున్నారని మాజీ ఎంపీ సబ్బం హరి పేర్కొన్నారు. ఓ ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పవన్ వెనక ముమ్మాటికి బీజేపీ ఉందని కుండబద్దలు గొట్టారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉండకూడదన్న మోడీ-షా ద్వయం కుట్ర వల్లే ఏపీకి ఇన్ని కష్టాలు వచ్చాయన్నారు.

రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న చంద్రబాబుకు అండగా నిలవకుండా దాని వల్ల తామెలా ప్రయోజనం పొందాలనే అంశంపైనే మిగతా పార్టీలన్నీ దృష్టి సారించాయన్నారు. స్వప్రయోజనాల కోసం అర్రులు చాస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా బీజేపీనే అడ్డుకుంటోందని, అన్నాడీఎంకే, టీఆర్ఎస్ పార్టీలతో ఆందోళన చేయిస్తోందని తేల్చి చెప్పారు. సాటి తెలుగువారికి అన్యాయం జరుగుతుంటే టీఆర్ఎస్ ఇలా చేయడం ఎంతమాత్రమూ సబబు కాదన్నారు.

మోడీపై ఇది తొలి అవిశ్వాసమని, చర్చకు వస్తే అంతర్జాతీయంగా ఆయన పరువు పోతుందనే అడ్డుకుంటున్నారని అన్నారు. మోడీపై అవిశ్వాసం పెడితే ఢిల్లీ వెళ్లి అందరి మద్దతు కూడగడతానని చెప్పిన పవన్ ఇప్పుడు రోజుకో రకంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. దీని వల్ల ఆయన గ్రాఫ్ దారుణంగా పడిపోయిందన్నారు. అవిశ్వాసానికి మద్దతు ఇస్తానన్న పవన్ ఇప్పుడు నాటకాలని అనడంతో ప్రజల్లో ఆయనపై నమ్మకం సన్నగిల్లిందన్నారు.

వైసీపీ-జనసేనలను ఉపయోగించుకుని టీడీపీని తొక్కేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనడంలో ఎటువంటి సందేహం లేదని సబ్బం హరి పేర్కొన్నారు. ఈ విషయంలో తన వద్ద పక్కా సమాచారం ఉందన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పని అయిపోయినట్టేనని, ఆ పార్టీతో ఎవరు కలిసినా మటాషేనని తేల్చి చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు తప్ప ఇంకెవరూ గౌరవంగా మాట్లాడడం లేదని, అడ్డగోలుగా విరుచుకుపడుతున్నారని సబ్బం హరి పేర్కొన్నారు.

బీజేపీ కనుసన్నల్లో నడవడానికి వైసీపీ అంగీకరించిందని, అయితే ఈ విషయాన్ని బహిరంగంగా చెబితే మైనారిటీల ఓట్లు పోతాయనే ఉద్దేశంతో జగన్ ఆ విషయాన్ని బయటపెట్టడం లేదని ఈ మాజీ ఎంపీ పేర్కొన్నారు. మోడీ హోదా ఇస్తారనే విశ్వాసం ఉందంటూనే బీజేపీతో పోరాటం చేస్తామంటున్న జగన్, విజయసాయిరెడ్డిలకు మతి భ్రమించిందని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. హోదా కోసం ఎన్డీయే కూటమి నుంచి బయటకు రావడం వల్ల టీడీపీకి మంచే జరిగిందని అభిప్రాయపడ్డారు.

ఎన్నికలకు ఇంకా 14 నెలల సమయం ఉండడంతో చంద్రబాబుకు వ్యతిరేకంగా పరిస్థితులను మార్చి తమకు అనుకూలంగా మలచుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని, రాజకీయంగా ఎటువంటి కుట్రలనైనా చంద్రబాబు దీటుగా ఎదుర్కోగలరని, ఇతరత్రా అయితే మాత్రం కొంచెం కష్టమేనని వివరించారు. చంద్రబాబుకు మున్ముందు ఉన్నవి గడ్డు రోజులేనని మాత్రం కచ్చితంగా చెప్పగలనన్నారు.