ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నాయకులు తిరుపతి ఉపఎన్నిక పేరు చెప్పి పవన్ కళ్యాణ్ నామ జపం చేస్తున్నారు. అయితే తెలంగాణలో అటువంటి పరిస్థితి ఉండదన్నట్టుగానే కనిపిస్తుంది. నిన్న ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ కలిసి నాగార్జునసాగర్ ఉపఎన్నిక కు మద్దతు కోరతారని వార్తలు వచ్చాయి.
ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాస అభ్యర్ధికి మద్దతు ఇచ్చిన జనసేన… అయితే బీజేపీకి బుద్ది చెప్పడానికి నాగార్జునసాగర్ ఉపఎన్నికలో జనసేన పోటీ చేస్తుందని ప్రచారం జరిగింది. అయితే అటువంటిది ఏమీ జరగకపోవడం జనసేన మద్దతు కోసం కమలనాథులు ప్రయాణించబోతున్నారని ప్రచారం జరిగింది.
అయితే అటువంటిది ఏమీ ఉండబోదు అని ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పకనే చెప్పారు. తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు ఉండదు. తెలంగాణలో మూర్ఖత్వపు పాలన సాగుతోంది. టిఆర్ఎస్ అరాచకం స్టార్ట్ అయ్యింది. సంఘ విద్రోహ శక్తులకు టిఆర్ఎస్ వత్తాసు పలుకుతుంది. ఒంటరిగానే తెరాసను గద్దె దించుతాం,” అని బండి సంజయ్ మీడియాతో చెప్పుకొచ్చారు.
దీనితో బీజేపీ తెలంగాణలో ఒంటరిగా, ఏపీలో జనసేనతో కలిసి నడవబోతున్నాయి. అయితే బీజేపీకి మాత్రమే ఉపయోగపడే ఈ మైత్రి… జనసేన ఎందుకు ఒప్పుకోవాలి అనే ప్రశ్న కూడా వస్తుంది. ఇది భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.