బీజేపీ వైఎస్సార్ కాంగ్రెస్ ఒకటైపోయాయి అంటూ గతంలో టీడీపీ విమర్శలు చేసేది. అందులో నిజమెంతో అబద్దమెంతో తెలీదు గానీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా యూసిలు అంటూ ఇంకోటి అంటూ ఆపేసిన బిల్లులు జగన్ ముఖ్యమంత్రి అయ్యాకా ఎటువంటి కొర్రీలు వెయ్యకుండా కేంద్రం విడుదల చేస్తుంది. మరోవైపు రెండు పార్టీల నేతలు కలిసి కట్టుగా తెలుగుదేశం పార్టీని అంతం చేసే పనిలో ఉన్నాయి. ఈ క్రమంలో నేతలు ఒకరికొకరు మాట సాయం చేసుకోవడం గమనార్హం.
ఇందుకు ఉదాహరణ ఈరోజు కలెక్టర్ అధ్యక్షతన జరిగిన తూర్పు గోదావరి జిల్లా సమీక్షా సమావేశం. ఈ సమావేశానికి మంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్, విపక్ష నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో బుచ్చయ్యచౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. బుచ్చయ్యచౌదరి బీజేపీనో, లేక మోడీనో ఏమీ అన్నందుకు కాదు ఈ వివాదం. వైఎస్సార్ కాంగ్రెస్ ను ప్రశ్నించినందుకు. గత ప్రభుత్వంలో మంజూరైన వర్క్ల బిల్లులు మంజూరు చేయాలని బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు.
అయితే మంత్రి కంటే ముందే సోమువీర్రాజు కలగజేసుకుని ప్రభుత్వం తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడారు. వైఎస్ హయాంలోని పనులను గత ప్రభుత్వం నిలిపివేసిందని, ఇప్పుడు టీడీపీ హయాంలో చేసిన బిల్లులు కూడా అంతే అని ఆయన చెప్పుకురావడం విశేషం. సోమువీర్రాజు ఏ పార్టీ వారు ఏ పార్టీ తరపున మాట్లాడుతున్నారు అని అర్ధం కాక అక్కడ ఉన్న వారు నోళ్ళు నొక్కుకున్నారట. క్షేత్ర స్థాయిలో బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ సమన్వయము అలా ఉందన్నమాట.