కింగ్ నాగార్జున హోస్టుగా చేస్తున్న బిగ్ బాస్-3 షో ఈ నెల 21న ప్రారంభం కాబోతుంది. అయితే షో ప్రారంభం తేదీ దగ్గర పడే కొద్దీ వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకుల లైంగిక వేధింపులపై నటి, టీవీ యాంకర్ శ్వేతారెడ్డి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ‘ఫిదా’ ఫేమ్ నటి గాయత్రీ గుప్తా కూడా షో నిర్వాహకులు తనను లైంగికంగా వేధించారని ఆమె ఆదివారం రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వంద రోజులు సెక్స్లో పాల్గొనకుండా ఉండగలవా అని వారు ప్రశ్నించారని పేర్కొన్నారు.
బిగ్ బాస్ ఆడిషన్స్కు వచ్చిన ప్రతి ఒక్కర్నీ ఇదే ప్రశ్న అడుగుతున్నట్టు నిర్వాహకులు ఆమెకు చెప్పారట. అలాగే షో ముందు నుంచే మరో సినిమాలో నటించవద్దని నిబంధన పెట్టారట. రెండు రోజుల క్రితం బిగ్బా్స-3లో ఆమె సెలెక్టు కాలేదని చెప్పారట. షో ఒప్పందం కారణంగా సినిమాల్లో వచ్చిన అవకాశాలు కోల్పోవడంతో సుమారు రూ.16 లక్షలు ఆర్థికంగా నష్టపోయా అని ఆమె రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆర్థికంగా నష్టం కలిగించడంతో పాటు లైంగిక వేధింపులకు గురి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.
విచారణ మొదలుపెట్టి తగిన చర్యలు తీసుకుంటామని రాయదుర్గం డీఐ విజయ్కుమార్ మీడియాకు తెలిపారు. మరోవైపు 100 రోజుల పాటు జరగబోయే ఈ షో లో 15 మంది పోటీదారులు ఉంటారట. ఈ షో పై ఇప్పట్నుంచే భారీ అంచనాలున్నాయి. మొదటి రెండు సీజన్లకు ఎన్టీఆర్, నాని హోస్టులు కాగా మూడోసారి నాగార్జున రంగంలోకి దిగుతున్నాడు. తమిళ, హిందీ బిగ్ బాస్ షోలకు అన్ని సీజన్లకు ఒకే హోస్ట్ ఉండగా తెలుగుకు మాత్రం మూడు సీజన్లకు ముగ్గురు అయ్యారు ఇప్పటికి.