భారత క్రికెట్ చరిత్రలో బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఓ సరికొత్త అధ్యాయాన్ని సృష్టించాడు. మూడు క్రికెట్ ఫార్మాట్లలో 5 వికెట్లు తీసిన ఘనత సాధించిన ఏకైక భారత బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. ఆదివారం నాడు దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో ఐదు వికెట్లు తీసిన భువీ, మూడు ఫార్మాట్లలో ఇదే ఫీట్ సాధించిన వాడిగా నిలిచాడు.
ఇప్పటికే 21 టెస్టులాడిన భువీ, 4 సార్లు ఐదు వికెట్లను పడగొట్టిన ఘనతను సొంతం చేసుకున్నాడన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో 86 వన్డే మ్యాచ్ లు ఆడి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసిన ఘనతను ఒకసారి దక్కించుకున్నాడు. కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే వేయగలిగే అవకాశం ఉండే టీ-20 మ్యాచ్ లోనూ ఐదు వికెట్లను తీయడంతో ఇప్పుడు భువీపై ప్రశంసల వర్షం కురుస్తోంది.