Pawan-Kalyan Bheemla Nayakధైర్యే సాహసే లక్ష్మి అంటారు మన పెద్దలు… అంటే ధైర్యం చేసిన వాడికి లక్ష్మీ కటాక్ష్యం సిద్ధిస్తుంది. సరిగ్గా అటువంటి నిర్ణయమే తీసుకున్నారు “భీమ్లా నాయక్” నిర్మాత సూర్యదేవర నాగవంశీ. రెండు రోజుల క్రితం ఆయన సినిమా ఈ నెల 25న విడుదల అవుతుందని ప్రకటించారు.

అయితే ఉన్న పళంగా మళ్ళీ వాయిదా పడొచ్చు అన్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఏపీలో 100% ఆకుపెన్సీ మీద ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోవడం.. అలాగే రేట్ల జీవో రాకపోవడంతో ఎవరి అనుమానాలు వారికి ఉన్నాయి. అయితే 100% ఆకుపెన్సీని ప్రభుత్వం ఇచ్చేసింది.

కానీ టిక్కెట్ రేట్లకు సంబంధించిన జీవో ఇప్పట్లో రాదు అని తేలిపోయింది. ఆ ఇష్యూకు సంబంధించిన కమిటి వారంలో నివేదిక ఇస్తాం అని ప్రకటించింది. వారంలో ప్రభుత్వానికి నివేదిక ఆ తరువాత ఒక వారంలో జీవో అనుకుంటే పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది.

ప్రభుత్వంలోని వారి అభిప్రాయం కూడా అదే కావొచ్చు. ఈ రిలీజ్ డేట్ పోతే ఏప్రిల్ 1… అంటే “ఆర్ఆర్ఆర్” వచ్చిన వారానికి.. థియేటర్లకు కూడా ఇబ్బంది పడాలి అలాగే “ఆర్ఆర్ఆర్” హంగామాను కూడా తట్టుకుని నిలబడాలి. ఒక రకంగా ముందు నుయ్యి వెనుక గొయ్యి.

అయితే ఈ ఒత్తిడిని తట్టుకుని ముందడుగు వెయ్యడానికే నిర్ణయించుకున్నాడు నాగవంశీ. ఫిబ్రవరి 25నే వస్తున్నాం అని తేల్చి చెప్పేశాడు. ధైర్యే సాహసే లక్ష్మి… ఇబ్బందులు ఉన్నా భీమ్లాతో పవన్ కళ్యాణ్ ను మొట్టమొదటగా నూరు కోట్ల క్లబ్ లో నిలబెడతారేమో చూద్దాం.