యూనివర్సల్ హీరో కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం భారతీయుడు 2. సీక్వెల్గా తెరకెక్కుతున్న ఈ సినిమా పరిస్థితి ఒక్క అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతోంది. ఈ సినిమాను ముందుగా దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కించాలని భావించారు. కానీ బడ్జెట్ కారణంగా సినిమా లైకా ప్రొడక్షన్స్ చేతికి వెళ్లింది. కొన్ని రోజుల షూటింగ్ అనంతరం లైకా సంస్థ కూడా బడ్జెట్ విషయంలో శంకర్కు ఆంక్షలు పెట్టడంతో దాదాపు ప్రాజెక్ట్ ఆగిపోయినట్టే అని భావించారు అంతా.
లైకా పెట్టిన కండిషన్స్కు శంకర్ ఓకే చెప్పటంతో భారతీయుడు 2 పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ నెల 19న రాజమహేంద్రవరంలో సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అవుతుందని సమాచారం. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ 14 2021లో తమిళ ఉగాది సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని రాబోతున్నారట. అంటే ఈ సినిమా కోసం దాదాపుగా రెండేళ్ల పాటు నిరీక్షణ తప్పదు. భారీ చిత్రం కావటంతో షూటింగ్కే ఎక్కువ రోజులు సమయం పడుతుందని అంటున్నారు.
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్, రకుల్ ప్రీత్ సింగ్లు కీలక పాత్రల్లో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. . ఇటీవలే రాజకీయాలలోకి వచ్చిన కమల్ హస్సన్ ఇదే తన చివరి సినిమా అని ఇప్పటికే ప్రకటించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2021లో జరగబోతున్నాయి. అంటే ఎన్నికలకు కొంచెం ముందు ఈ సినిమా విడుదల కాబోతుంది. అవినీతిపై పోరాటం గురించిన సబ్జెక్టు కావడంతో ఇది ఎన్నికలలో కమల్ కు ఉపయోగపడుతుందని ఆయన భావిస్తున్నారు.