Bharat Ane Nenu pre-release event in Hyderabad-ఏప్రిల్ 20వ తేదీన విడుదలకు సిద్ధమైన కొరటాల శివ – ప్రిన్స్ మహేష్ బాబుల ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక విజయవాడ నుంచి హైదరాబాద్ కు మారినట్లుగా సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వర్తమాన రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో… విజయవాడలో ఈ వేడుక నిర్వహిస్తే రాజకీయ వివాదాలు తలెత్తవచ్చని చిత్ర యూనిట్ తో పాటు మహేష్ బాబు కూడా భావించిన మీదటే నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

సహజంగానే రాజకీయాలకు దూరంగా ఉండే మహేష్, తన చిత్రం కొత్త రాజకీయ దుమారానికి కేంద్రం కాకూడదని స్వయంగా నిర్మాతలకు చెప్పినట్టు సమాచారం. అలాగే మహేష్ బాబు బావ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తొంది. నిజానికి విజయవాడలో ఈ వేడుక నిర్వహించాలని గల్లా జయదేవ్ ఒత్తిడి చేసినట్లుగా ఇటీవల హల్చల్ చేసిన వార్తలు గురించి తెలిసిందే.

కాజ టోల్ ప్లాజా సమీపంలో ఇటీవల పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిపిన చోటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా చేయనున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, అధికారికంగా ఏ విషయం వెల్లడి చేయలేదు. అంతకుముందు వైజాగ్ లో ఈవెంట్ చేయనున్నట్టు కూడా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం మేరకు హైదరాబాద్ లోనే ఈ కార్యక్రమం జరిపించాలని నిర్ణయించడం ఏపీ అభిమానులు నిరాశ చెందే వార్తే.