Flash-Bharat-Ane-Nenu-Censored---A-Reportప్రస్తుతం ‘భరత్ అనే నేను’ సినిమా విడుదల కార్యక్రమాలతో ‘టాక్ ఆఫ్ టాలీవుడ్’గా మారిన నిర్మాత దానయ్య త్వరలో రాజమౌళితో కలిసి జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు. ‘భరత్ అనే నేను’ ప్రమోషన్స్ లో ఉన్న దానయ్యకు ఈ భారీ మల్టీస్టారర్ సినిమాకు సంబంధించిన ప్రశ్నలు మీడియా వర్గాల నుండి ఎదురయ్యాయి.

సాంకేతిక నిపుణులతో సహా అందరికీ రాజమౌళి కధ చెప్పారని, ఒక్క మాటలో చెప్పాలంటే విజువల్ ట్రీట్ ఖాయమని, దాదాపుగా 300 కోట్ల రూపాయలు బడ్జెట్ అవుతుందని అనుకుంటున్నామని దానయ్య తెలిపారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనేది ఇప్పుడే చెప్పలేమని, కానీ ఈ ఏడాదిలో అయితే ఖచ్చితంగా ప్రారంభం అవుతుందని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని అన్నారు.

రాజమౌళి గారితో సినిమా నిర్మించడం అనేది ఓ కల అని, అది ఈ ఏడాది సాకారం కావడం తన అదృష్టమని చెప్పిన దానయ్య, ఇదే ఏడాది మహేష్ బాబుతో నిర్మించాలన్న కోరిక కూడా తీరిందన్న భావాన్ని వ్యక్తపరిచారు. మా బ్యానర్ గర్వపడే సినిమాగా ‘భరత్ అనే నేను’ నిలుస్తుందని, అందుకు కొరటాల శివకు ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.