అవకాశం చిక్కినప్పుడల్లా ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడుతున్న ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేరంగుల ఉదయ్ కిరణ్ తాజాగా మరోసారి పవన్ మరియు ఏపీ సిఎంలను టార్గెట్ చేసుకుని సంచలన ఆరోపణలు చేసారు. “ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్ ల నుంచి తనకు ప్రాణహాని ఉందని” ఉదయ్కిరణ్ ఆరోపించారు.
‘తనకేదైనా జరిగితే వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని, వారిద్దరినీ విమర్శిస్తూ తాను ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశానని, దీంతో తన కుమార్తెను కిడ్నాప్ చేసేందుకు కొందరు దుండగులు ప్రయత్నించారని’ పేర్కొన్నారు. తనకు వారిద్దరి నుంచి ప్రమాదం పొంచి ఉందని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, దీంతో సెంట్రల్ హోం సెక్రటరీకి ఫిర్యాదు చేశానని, అయినా ఫలితం లేకుండా పోయిందన్నారు.
కేంద్ర, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లలో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, పోలీసులు తప్పుడు నివేదిక ఇవ్వడమే ఇందుకు కారణమన్నారు. చివరికి హైకోర్టును ఆశ్రయించానని, ఈ నెల 22వ తేదీ లోపు వివరణ ఇవ్వాల్సిందిగా ఏపీ డీజీపీని కోర్టు ఆదేశించిందని తెలిపారు. ఉదయ్ కిరణ్ చేస్తున్న విమర్శల మాదిరే ఈ ఆరోపణలు కూడా అర్ధరహితమని పవన్ అభిమానులు మండిపడుతుండగా, టిడిపి వర్గాలు ఈ ఆరోపణలను అసలు పరిగణనలోనికి తీసుకోవడం లేదు.