బీజేపీ నాయకులు తెలంగాణలోని కేసీఆర్ సర్కారు ని కూల్చే ప్రయత్నాలు చేస్తున్నారు? మనకు సరిగ్గా తెలీదు గానీ ఆ డైరెక్షన్లోనే పదే పదే ఆ పార్టీ నాయకులు చెప్పడం గమనార్హం. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కార్ ఎప్పుడైనా పడిపోవచ్చని, వచ్చే రెండు సంవత్సరాలు ఉండటం కష్టమేనంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటువంటి వ్యాఖ్యలే ఆయన, మరి కొందరు నేతలు జీహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా కూడా చేశారు. దుబ్బాక, గ్రేటర్ లో ప్రయోగించిన బీజేపీ వ్యాక్సిన్ ఫలించిందని, ఇక ఖమ్మంపైనే తమ నెక్ట్స్ ప్రయోగం అంటూ సంజయ్ స్పష్టం చేశారు. బండి సంజయ్… ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ తో కలిసి ఖమ్మంలో పర్యటించారు.
ఈ సందర్భంగా ఖమ్మంలో మంత్రి పువ్వాడపై నిప్పులు చెరిగారు. నాలుగు సంవత్సరాల్లో నాలుగు పార్టీలు మారిన మంత్రి పువ్వాడ… మాకు నీతులు చెప్తున్నారని, అక్రమ భూములను రెగ్యూలర్ చేయించుకోవటానికే టీఆర్ఎస్ లో చేరావ్ అంటూ విరుచుకుపడ్డారు. బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని, మీ అక్రమాల చరిత్ర బయటపెడుతాం అంటూ హెచ్చరించారు.
తెలంగాణ శాసనసభలో కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీకి అంత సీన్ ఉంటుందా? ఒకవేళ అదే జరిగితే ప్రజలు ఊరుకుంటారా? కేసీఆర్ ప్రభుత్వం పై సహజంగా వస్తున్న ప్రజావ్యతిరేకత ను పెరగనీయకుండా బీజేపీ తొందర పడుతుందా? ఆ తొందర పాటే టీఆర్ఎస్ కి ప్లస్ అవుతుందేమో కూడా.