Ballari- MP B. Sriramuluదేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన గాలి జనార్ధన్ రెడ్డి కూతురు వివాహ శుభలేఖతో, ఈ పెళ్లికి అయ్యే ఖర్చుపై రకరకాల వార్తలు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఒక్కో కార్డుకు దాదాపు 6 వేల రూపాయలు ఖర్చు పెట్టిన గాలి, వివాహ మహోత్సవానికి కొన్ని వందల కోట్ల రూపాయలను తృణప్రాయంగా ఖర్చు చేస్తున్నారనేది ఈ వార్తల సారాంశం. అయితే ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు బళ్ళారి ఎంపీ శ్రీరాములు.

జనార్ధన్ రెడ్డి కుమార్తె బ్రాహ్మణి తనకు కూడా కూతురు లాంటిదేనని, ఈ పెళ్లి ఖర్చుపై వస్తున్న వార్తలలో నిజం లేదని, నిజానికి పెద్దగా ఖర్చు చేయాలన్న ఉద్దేశం తమకు లేదని, ఓ సాధారణ మధ్య తరగతి స్థాయిలోనే ఈ వేడుక జరుగుతుందని తెలిపారు. అయితే శుభలేఖ కోసం మాత్రం నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుని తయారు చేసామని, కాస్త వెడ్డింగ్ కార్డ్ గురించి కవర్ చేసుకునే ప్రయత్నం చేసారు.

ఈ ‘బళ్ళారి బాబు’ కామెంట్స్ పై సెటైర్లు వేయడం నెటిజన్ల వంతవుతోంది. ‘మధ్య తరగతి స్థాయిలోనే ఈ రేంజ్ లో వివాహ వేడుకలకు సిద్ధం అవుతుంటే, వారి రేంజ్ లో చేయాలంటే ఇంకెన్ని కోట్లు ఖర్చు పెడతారో’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇంకొందరు అయితే కొన్ని తెలుగు సామెతలను ఈ సందర్భంగా వదులుతున్నారు. అదేలెండి… ‘వినేవాడు వెర్రిపుష్పం అయితే చెప్పేవాడు ఎంతైనా చెప్తాడు’ అన్నట్లు..!