2019 ఎన్నికల్లో హిందూపురం నుంచే పోటీ చేస్తారా? లేక మరో నియోజకవర్గానికి వెళతారా? అనే ప్రశ్నకు తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి నటసింహం బాలకృష్ణ క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గతంలో పామర్రు నియోజకవర్గం నుండి పోటీ చేస్తారన్న నేపధ్యంలో… తాజాగా హిందూపురం నుంచే పోటీ చేయబోతున్నట్టు బాలయ్య తమకు స్పష్టం చేశారని టీడీపీ శ్రేణులు తెలిపాయి. మరోవైపు హిందూపురం అభివృద్ధి విషయంలో బాలయ్య ప్రత్యేక దృష్టిని సారించారు.
లేపాక్షి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. 50 లక్షలను ఖర్చు చేసి జఠాయువును ప్రతిష్టించారు. రాయల కాలం నాటి ఆలయాల అభివృద్ధికి నిధులను సేకరించారు. హిందూపురం దాహార్తిని తీర్చేందుకు గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి హిందూపురానికి వేస్తున్న పైప్ లైన్ పనులు వేగంగా సాగుతున్నాయి. మడకశిర బ్రాంచ్ కెనాల్ నీటిని కూడా ఇవ్వగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో, బాలయ్య పాలన పట్ల నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉన్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.