balakrishna-no-reponse-on-naga-babu-commentsమెగా బ్రదర్ నాగబాబు నందమూరి బాలకృష్ణ మీద మొదలు పెట్టిన దండయాత్ర ఇప్పట్లో ఆపేలా లేరు. రోజుకు రెండు వీడియోల చప్పున బాలయ్య మీద విమర్శలు చేస్తూ ముందుకు పోతున్నారు నాగబాబు. రేపు బాలయ్య ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా రిలీజ్ సందర్భంగా కూడా ఆయన వీడియో విమర్శలు ఆపకుండా ముందుకుపోవడం గమనార్హం. తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ పై కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. కట్టుకథలు మూటకట్టి ప్రేక్షకుల మొహాన కొట్టొదయ్యా అంటూ వేమన శతకం తరహాలో ఓ కవితనే నాగబాబు అందుకున్నారు.

సహజంగా ఇటువంటి సందర్భంలో తన సహజశైలిలో విరుచుకుపడే బాలయ్యే మనకు తెలుసు. అయితే ఆయన ఎందుకో ఈ విషయంపై స్పందించడం లేదు. తిరుమలలో ఈ రోజు స్వామి వారి దర్శనం చేసుకుని తిరుపతి పీజేఆర్‌ మూవీ ల్యాండ్‌లో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని బాలకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ … సినిమా విడుదల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 100కు పైగా థియేటర్లలో ఎన్టీఆర్‌ విగ్రహాలు పెడుతున్నామన్నారు.

ఎన్టీఆర్‌ స్పూర్తితోనే సినిమాల్లోకి వచ్చానని, ఎన్టీఆర్‌ బయోపిక్‌ సినిమాతో తండ్రి రుణం తీర్చుకున్నానని చెప్పుకొచ్చారు ఆయన. నాగబాబు వ్యాఖ్యలపై నో కామెంట్‌ అంటూ ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు బాలయ్య జవాబు ఇచ్చారు. గతంలో ఎప్పుడూ లేనిది ఈసారి ఈ విషయంలో బాలయ్య ఆవేశం కంట్రోల్ చేసుకోవడం మంచిదే. ఒకవేళ బాలయ్య కూడా దీనిపై స్పందించి ఉంటే ఇది కులాల మధ్య కుంపటిలా అయ్యే అవకాశం ఉందని ఇప్పటికే విశ్లేషకులు వారించారు.