balakrishna - jr ntr-తెలుగుదేశం పార్టీ తొలి శ్రామికుడు, చైతన్య రథ సారధి, మా అన్నయ్య హరికృష్ణ మన మధ్య లేరంటే నమ్మలేక పోతున్నానని హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి నటసింహం బాలకృష్ణ అన్నారు. ‘అరవింద సమేత’ చిత్రానికి ఇంతటి ఘన విజయాన్ని కట్టబెట్టిన ప్రేక్షకులకు మొదట తాను అభినందనలు తెలుపుతున్నానని చెప్పారు.

తాను ఎన్టీఆర్ బయోపిక్ లో బిజీగా ఉండి ఈ సినిమాను చూడలేకపోయానని తెలిపారు. మహిళ అంటే ఎంతో గొప్పది అనే ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని అన్నారు. తాను, తారక్ చేసే సినిమాలు మరెవరూ చేయలేరని, అసాధ్యమని, తమ చిత్రాల్లో నవరసాలు ఉండాలని చెప్పారు.

దర్శకుడు త్రివిక్రమ్ సినిమాలను గొప్పగా తీస్తారని కితాబిచ్చారు. చారిత్రక సినిమాలు, పోరాట చిత్రాలకు నందమూరి కుటుంబం పెట్టింది పేరని అన్నారు. తమ అభిమానులంతా క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. జోహార్ హరికృష్ణ, జోహార్ ఎన్టీఆర్ అంటూ నినదించారు.

ఇక జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ… ఈ ఆనంద సమయంలో నాన్న ఉంటే బాగుండేదని… నాకు తెలిసి నాన్న ఇక్కడే ఎక్కడో ఉండి చూస్తుంటారని అన్నారు. నాన్న లేకపోయినా నాన్న హోదాలో ఇక్కడకు వచ్చిన బాబాయ్ కు పాదాభివందనం చేస్తున్నానని ఉద్వేగపూరితంగా చెప్పాడు.

ఈ విజయానికి మీ ఆశీస్సులు అందజేసినందుకు ధన్యవాదాలు అని అన్నాడు. ఈ సినిమా ఘన విజయం సాధించిన ఆనందాన్ని అభిమానులతోనే కాకుండా, బాబాయ్ తో కూడా పంచుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. ఈ ఫంక్షన్లో ఇంతకన్నా తాను ఎక్కువ మాట్లాడితే బాగోదని… మీరందరూ బాబాయ్ మాటల కోసం ఎదురు చూస్తున్నారని జోహార్ ఎన్టీఆర్.. జై ఎన్టీఆర్.. జోహార్ హరికృష్ణ… జై హరికృష్ణ అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు.