balakrishna and Jr NTRబాలకృష్ణ, ఎన్టీఆర్ ల మధ్య ఉన్న అగాధం తెలిసిందే. అయితే ఒకప్పుడు వారిద్దరూ కలిసిమెలిసి ఉండేవారు ఆ తరువాత రాజకీయ విషయాలలో విబేధాల కారణంగా గ్యాప్ వచ్చింది. అయితే బాలయ్య, ఎన్టీఆర్ మొట్టమొదట కలిసింది ఎప్పుడు? హరికృష్ణ రెండో భార్య కుమారుడు కావడంతో ఆయనను చాలా కాలం కుటుంబసభ్యులు దూరం పెట్టారని, సక్సెస్ వచ్చాకే కలుపుకున్నారని కొందరి ఆరోపణ.

దీనిపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఒక ఆసక్తికర విషయం తెలిపారు. పాలకొల్లులో అల్లరి రాముడు షూటింగ్ సందర్భంగా బాలయ్య మీద తనకు ఉన్న ప్రేమ గురించి ఎంతో గొప్పగా చెప్పాడట ఎన్టీఆర్, అలాగే వారి మధ్య మాటలు లేవని చెప్పేసరికి గోపాలకృష్ణ గారు అప్పటికప్పుడు బాలయ్యకు ఫోన్ చేసి మాట్లాడించారట.

బాలయ్యతో ఎన్టీఆర్ ఎంతో ఆప్యాయంగా మాట్లాడగా, ఎన్టీఆర్ కూడా అంతే ఉద్విగ్నంగా తాను బాబాయ్ కి ఎంతటి అభిమానినో చెప్పుకున్నాడట. బాలయ్యతో మాట్లాడుతూ వెక్కి వెక్కి ఏడ్చాడట. ఆ తరువాత బాలయ్య, ఎన్టీఆర్ మొట్టమొదటి సారి ఒక పబ్లిక్ ఫంక్షన్…. ఏపీ సినీగోయర్స్ అవార్డ్స్ ఫంక్షన్ సందర్భంగా కలిసి ఏర్పాటు చేశారట గోపాలకృష్ణ, ఆ అవార్డ్స్ నిర్వాహకులు.

అప్పుడు కన్నీటి పర్యంతం అవుతూ ఎన్టీఆర్ బాలయ్యకి దండ వెయ్యడం తాలూకు ఫోటోలు ఇప్పటికీ అంతర్జాలంలో లభ్యం అవుతాయి. మొత్తానికి ఆ విధంగా ఎన్టీఆర్, బాలయ్యలను కలపడంలో పరుచూరి గోపాలకృష్ణ కీలక పాత్ర పోషించారన్న మాట. కొంత కాలం మంచి సంబంధాలు నెరిపాక 2009 ఎన్నికల తరువాత వారిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. ఆ తరువాత హరికృష చనిపోయిన తరువాతే ఇద్దరు మళ్ళీ ఒక చోట కనిపించారు. బాలయ్య దగ్గరుండి అంతా చూసుకున్నా, రెండు మూడు ఫంక్షన్లకు కలిసి వచ్చినా ఇంకా వారి మధ్య పూర్తి స్థాయిలో సంబంధాలు పునరుద్ధరణ కాలేదనే చాలా మంది అభిప్రాయం.