ఇటీవల బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘ప్రేమ రతన్ ధన్ పాయే’ చిత్రం తెలుగులో ‘ప్రేమలీల’గా డబ్ అయిన విషయం తెల్సిందే. బాలీవుడ్లో భారీ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా టాలీవుడ్లో సైతం పర్వాలేదు అనే స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ‘ప్రేమలీల’ అంతో ఇంతో సక్సెస్ అవ్వడంతో మరో బాలీవుడ్ సినిమాను తెలుగులో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీ బడ్జెట్తో, చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కిన ‘బాజీరావు మస్తానీ’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయబోతున్నారు.
రణవీర్ సింగ్ టైటిల్ రోల్లో నటించిన ఈ సినిమాలో ఇద్దరు బాలీవుడ్ బ్యూటీలు దీపికా పదుకునే, ప్రియాంక చోప్రాలు హీరోయిన్లుగా నటించారు. సంజయ్ లీలా భన్సాలీ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాపై బాలీవుడ్ ప్రేక్షకుల్లో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఇది ‘బాహుబలి’ని బ్రేక్ చేసే సినిమా అవుతుంది అంటూ బాలీవుడ్లో ఒక వర్గం వారు గట్టి నమ్మకంతో ఉన్నారు. కలెక్షన్స్ రికార్డులు బ్రేక్ చేస్తాయని చిత్ర యూనిట్ సభ్యులు దృడ నమ్మకం పెట్టుకున్నారు. డిసెంబర్ 18న ఈ సినిమాను హిందీ మరియు తెలుగులో విడుదల చేయబోతున్నారు. తెలుగులో కూడా అదే టైటిల్తో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతుంది.