అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో శుక్రవారం అరకు నియోజకవర్గం టిడిపి ఇన్ఛార్జి, మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ అధ్వర్యంలో పెదబయలు మండలంలోని లక్ష్మీపేట పంచాయతీ బల్లపురాయి గ్రామంలో శుక్రవారం బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఐదేళ్ళ టిడిపి పాలనలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా హాయిగా గడిచిపోయింది. కానీ ఈ మూడేళ్ళ వైసీపీ పాలనలో రాష్ట్రంలో మారుమూల గ్రామాలలో నివసించే ప్రజలకు కూడా సిఎం జగన్మోహన్ రెడ్డి అనేక ఇబ్బందులు కల్పిస్తున్నారు. ప్రభుత్వమే సామాన్య, నిరుపేద ప్రజలను అన్నిటి ధరలు, ఛార్జీలు పెంచేసి బాదేస్తుంటే ఎలా జీవించాలి?రాష్ట్రంలో ఎవరూ జగన్ పాలన పట్ల సంతోషంగా లేరు. మళ్ళీ ఎప్పుడు ఎన్నికలొస్తాయా… ఎప్పుడు జగన్ను బయటకి సాగనంపుదామా? అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం పట్ల ప్రజలలో నెలకొన్న ఈ వ్యతిరేకత టిడిపికి వరంగా మారనుంది. కనుక పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ కూడా జగన్ హయాంలో జరుగుతున్న అరాచకాలను, మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే కలిగే మేలు గురించి ప్రజలకు వివరించాలి,” అని అన్నారు.
ఈ బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో టిడిపి ఎస్టిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సియ్యారి దొన్నుదొర, ఎస్సీ, ఎస్టీ కమీషన్ మాజీ సభ్యుడు సివేరి అబ్రహం, టిడిపి నేతలు పాండురంగ స్వామి, కొర్రా నాగేశ్వర రావు, సీకరి సుకుమారీ, త్రినాధ్, బి.రామారావు, కూడ వెంకట్, ఎన్. ప్రసాద్, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలోని పాడేరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, టిడిపి నియోజకవర్గం ఇన్ఛార్జి గిడ్డి ఈశ్వరి శుక్రవారం తన నివాసంలో టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఐటిడిపి నియోజకవర్గం ఇన్ఛార్జి బుద్ధ జ్యోతి కిరణ్, టిడిపి నేతలు ముర్ల కోటేశ్వరరావు, అల్లంగి సుబ్బలక్ష్మి, పాంగి భాస్కరరావు, పాంగి రాము, చికిటికెల రాము, సరమండ శ్రీధర్, వియ్యపు నాగేంద్ర, కిముడు కళ్యాణం, డి.వెంకట కుమారి, పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.