Badhude Badhudu Program in Prakasam Districtప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని కారుమంచిలో గురువారం టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు కామని విజయ కుమార్‌, టిడిపి నాయకులు ఈదర ప్రభాకర్, బ్రహ్మానందంల అధ్వర్యంలో బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం జరిగింది. దీనిలో పార్టీ నేతలు ఆత్మకూరి శ్రీనివాసరావు, పిల్లి కోటేశ్వర రావు, కసుకుర్తి భాస్కర్, జక్కుల శ్రీను, సురేంద్ర రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టిడిపి నాయకుడు ఈదర ప్రభాకర్ మాట్లాడుతూ, “టిడిపి ప్రభుత్వం కారుమంచి-ఎం.నిడమలూరు మద్య రోడ్డు నిర్మించింది. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ రోడ్డు పాడయ్యి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ జిల్లా మంత్రి, స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఎవరూ పట్టించుకోవడంలేదు. వారి దృష్టి ఎంతసేపు సంక్షేమ పధకాల డప్పు కొట్టుకోవడం, లేదా ఓట్లు సీట్ల లెక్కలు చూసుకోవడానికే సరిపోతుంది. ప్రజా సమస్యలను పట్టించుకొనే తీరిక, ఆసక్తి రెండూ లేవు.

వారి అధినేత సిఎం జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు ఇంకా ఎక్కడ అప్పులు పుడతాయి?లేకుంటే ఏ ఏ ఛార్జీలు పెంచేయాలి?అనే ఆలోచిస్తుంటారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న అప్పులు చూస్తుంటే ఏదో ఓ రోజు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కూడా శ్రీలంకలా దివాళా తీస్తుందేమో అని భయం వేస్తుంది. కనుక జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని ఎంత త్వరగా బయటకు సాగనంపితే అంత మంచిది. ప్రజలు కూడా వైసీపీని సాగనంపడానికే చాలా ఎదురుచూస్తున్నారు,” అని అన్నారు.