Baahubali 2 Sivaratri poster controversy‘మహాశివరాత్రి’ పర్వదినాన్ని పురస్కరించుకుని “బాహుబలి 2”కు సంబంధించి లేటెస్ట్ పోస్టర్ ను విడుదల చేసారు దర్శకధీరుడు రాజమౌళి. హీరోయిజాన్ని రెట్టింపు చేసే విధంగా ఉన్న ఈ స్టిల్ వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఏనుగుపై నిల్చున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, “బాహుబలి” టైటిల్ కు తగినట్లుగా సరిపోయారని చెప్పవచ్చు. సినీ అభిమానుల చేత కేక పెట్టించే విధంగా ఉన్న ఈ పోస్టర్ లో మరో కోణం కూడా కనపడుతోంది.

ఇటీవల కాలంలో ఏ విషయం దొరుకుతుందా… వివాదాస్పదం చేసి మీడియాలో కాసింత హల్చల్ చేద్దామనుకునే వారికి కొదవలేదు. అయితే అలాంటి వారికి ఈ పోస్టర్ కాస్త ఊతమిచ్చే విధంగా ఉందని చెప్పవచ్చు. ఏనుగు తలపై ప్రభాస్ కాలు పెట్టడంతో, మూగ జీవులను హింసించే విధంగా ఈ ‘బాహుబలి 2’ పోస్టర్ ఉందన్న వివాదాన్ని, మూటకట్టుకునే అవకాశాలు కనపడుతున్నాయి.

ఇటీవల విడుదల చేసిన ‘బాహుబలి 2’ పోస్టర్ కూడా వివాదం అయిన విషయం తెలిసిందే. ప్రభాస్, అనుష్క లుక్ లతో కూడిన సదరు పోస్టర్ లో విల్లులను సరిగా పెట్టలేదంటూ నెటిజన్లు ఏకిపారేయగా, ఆ తర్వాత విషయాన్ని గమనించిన చిత్ర యూనిట్, వాటిని సరిచేస్తూ మళ్ళీ కొత్త పోస్టర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో మళ్ళీ ‘బాహుబలి 2’ పోస్టర్ ఎక్కడ వివాదం కానుందోనని సినీ అభిమానులు ఆందోళన పడుతున్నారు.