Baahubali2 Second Half Screened First in Banglore PVR ధియేటర్లలో “బాహుబలి-2” సృష్టిస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. సినీ అభిమానుల దార్ల‌న్నీ ‘బాహుబ‌లి 2’ ప్ర‌ద‌ర్శిస్తోన్న‌ సినిమా థియేట‌ర్ల వైపే ఉన్నాయి. అయితే బెంగళూరులోని కొందరు సినీ అభిమానులకు ఈ రోజు ఓ విచిత్ర అనుభ‌వం ఎదురైంది. బెంగళూరులోని పీవీఆర్‌ ఎరీనా మాల్‌లో గురువారం రాత్రి ‘బాహుబలి 2’ ప్రీమియర్‌ షో ఏర్పాటు చేయ‌గా, సినిమా వేసే ఉత్సాహంలో ఉన్న ధియేటర్ సిబ్బంది ముందుగా సినిమా సెకండాఫ్ ను ప్లే చేశారు. షో మొదలు కావడమే బాహుబ‌లి ప్ర‌భాస్, భ‌ల్లాలదేవుడి సేన‌లు యుద్ధంలో పాల్గొంటూ క‌నిపించాయి.

సినిమా మొద‌లు కాగానే ఇటువంటి సీన్ వ‌స్తుందేంటీ అనుకున్న అభిమానులు ఈ సినిమాలో అలాగే ఉందనుకుని అలాగే చూసేశారు. అయితే కాసేపటికి క్లైమాక్స్‌ సీన్ వ‌చ్చేయ‌డంతో ప్రేక్షకులకు అసలు విషయం అర్థమైపోయి, సెకండ్‌ ఆఫ్‌ను ముందు వేశారేంట‌ని థియేటర్‌ యాజమాన్యాన్ని నిల‌దీశారు. సినిమాను మొదట్నుంచీ మ‌ళ్లీ వేస్తామని థియేటర్‌ యాజమాన్యం చెప్పడంతో శాంతించిన అభిమాన గణం, మళ్ళీ ఫస్టాఫ్ నుండి మొత్తం చూసారు. అయితే ఈ సినిమాలో సెకండాఫ్ ను రెండు సార్లు చూసిన ఘనత ఆ ప్రేక్షకులకు దక్కింది.

అంటే ‘బాహుబలి 2’ సినిమాను మొత్తం నాలుగున్నర్ర గంటలు చూసారన్న మాట. ఇదిలా ఉండగా, ‘బాహుబలి 2’ సినిమాపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ కూడా ‘బాహుబలి 2’ సినిమాను ఒక ‘ఎపిక్’గా అభివర్ణిస్తున్నారు. ఇలాంటి అద్భుతాలను సినిమా హాలులోనే చూడండి… పైరసీని ప్రోత్సహించవద్దంటూ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా అభిమానులకు, సినీ ప్రేక్షకులకు పిలుపునిచ్చారు.