Baahubali 2 Rajamouli - ATM Thief - Sambhav Acharya Arrest‘బాహుబలి 2’ మేనియా ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా… బాక్సాఫీస్ వద్ద తొలి మూడు రోజుల్లోనే 500 కోట్లకు పైగా వసూలు చేయడంతోనే కధంతా అందరికీ అర్ధమైంది. సాధారణ ప్రేక్షకులు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అన్న తారతమ్యం లేకుండా అందరూ ‘బాహుబలి 2’ ధియేటర్ల వైపుకు పరుగులు పెట్టారు… పెడుతున్నారు కూడా..! అయితే వీళ్ళే కాదు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ను కూడా ‘బాహుబలి’ మేనియా ఊపేస్తుందన్న విషయం తాజాగా వెలుగు చూసింది.

ఒడిశాలోని మోస్ట్ వాంటెడ్ ఏటీఎం దొంగ సంభవ్ ఆచార్య కోసం పోలీసులు చాలాకాలంగా అన్వేషణ సాగిస్తున్నారు. అయితే పోలీసు వాసన తగలడమే చాలు, వారి నుండి తప్పించుకుంటూ పోలీసులకు కొరకరాని కొయ్యగా మారాడు సంభవ్ ఆచార్య. దీంతో ఎలాగైనా అరెస్ట్ చేయాలని రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. అయినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకపోయింది. కానీ, అంతటి దొంగ కూడా ‘బాహుబలి 2’ సినిమాను వీక్షించడం కోసం భువనేశ్వర్ లోని ఓ ధియేటర్ కు వచ్చాడు.

అయితే సంభవ్ ఆచార్యను గుర్తించిన స్పెషల్ స్క్వాడ్ పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. దాదాపుగా 50 ఏటీఎంలను లూటీ చేసినట్లుగా కేసులున్న సంభవ్ ఆచార్యను పట్టుకోవడం పోలీసుల వల్ల కూడా సాధ్యం కాకపోగా, రాజమౌళి విడుదల చేసిన ‘బాహుబలి 2 – ది కన్ క్లూజన్’తో క్రిమినల్ కూడా పట్టుబడుతున్నారు. దీంతో ‘బాహుబలి 2’ వలన తమకు మంచే జరుగుతుందని ఒడిశా పోలీసులు పండగ చేసుకుంటున్నారు. మరి ఈ విషయం జక్కన్నకు చేరిందో లేదో..!