Atchannaidu TDPటిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈరోజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మరో ఆసక్తికరమైన విషయం బయటపెట్టారు. “వైసీపీలో చాలా మంది ఎమ్మెల్యేలు టచ్చులో ఉన్నారని చెపితే వారి పేర్లు బయటపెట్టాలంటూ కొందరు మంత్రులు సవాలు చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒకవేళ మేము వారి పేర్లు బయటపెడితే వారి పరిస్థితి ఏవిదంగా మారిపోతుందో వైసీపీలో అందరూ స్వయంగా చూస్తూనే ఉన్నారు. మేమేదో ఈవిదంగా మైండ్ గేమ్ ఆడుతున్నామని కొందరు మంత్రులు చెప్పుకొంటున్నారు. మాకు మైండ్ గేమ్స్ ఆడవలసిన అవసరమే లేదు. వైసీపీలో ఎటువంటి పరిస్థితులున్నాయో బయటకు వస్తున్నవారే ప్రెస్‌మీట్‌లు పెట్టి మరీ చెపుతున్నారుగా?కనుక టిడిపి గేట్లు తెరిస్తే వచ్చేయడానికి వైసీపీలో చాలా మందే ఉన్నారు.

“నా కంఠంలో ఊపిరి ఉన్నంతవరకు, చివరి రక్తపు బొట్టువరకు జగనన్న వెంటే నడుస్తాము” అంటూ సినిమా డైలాగ్స్ చెపుతున్నవారే మా పార్టీలో చేరాలనుకొనేవారి జాబితాలో ముందు వరుసలో ఉన్నారు. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే, వచ్చే ఎన్నికలలో టిడిపి తమకు ఒక్క టికెట్‌ ఇస్తుందని గ్యారెంటీ ఇస్తే తమతో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలని టిడిపిలోకి తీసుకువస్తామని మాకు బంపర్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. దీనిని బట్టి వైసీపీలో పరిస్థితి ఏవిదంగా ఉందో, వైసీపీ ఎమ్మెల్యేలు తమ భవిష్యత్‌ పట్ల ఎంత ఆందోళనతో ఉన్నారో అర్దం చేసుకోవచ్చు.

ఇక వైసీపీ ప్రభుత్వంలో సీనియర్ మంత్రులైన ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కనీసం ఓ కానిస్టేబుల్ లేదా ఓ టీచర్‌ని కూడా బదిలీ చేయించుకోలేని నిస్సహాయస్థితిలో ఉన్నారు పాపం. గతంలో వారు మంత్రులుగా ఉన్నప్పుడు ఎంత దర్జాగా జీవించారో వారికి తెలుసు. ప్రజలు కూడా చూశారు. ఈ విషయం నాకంటే వారికే బాగా తెలుసు. వారిద్దరూ చాలా కాలంగా తీవ్ర అభద్రతాభావంతో, అణగిమణిగి బ్రతుకుతున్నారు కనుకనే తరచూ నోరు జారుతున్నారు. సామాన్య ప్రజలపై నోరు పారేసుకొంటున్నారు. కానీ వైసీపీలో ఇక ఎవరూ చేయగలిగిందేమీ లేదు జరుగబోయే దాని కోసం ఎదురుచూడటం తప్ప!” అని వైసీపీ నేతల పరిస్థితిని కళ్ళకు కట్టిన్నట్లు అచ్చెన్నాయుడు వివరించారు.

Atchannaidu said 4 ycp mlas giving offers to us