తెలుగుదేశం పార్టీ హయాంలో ఈఎస్ఐ మందుల కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి నిమ్మాడలోని ఆయన స్వగృహంకు వంద మందికిపైగా పోలీసులు చేరుకుని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈఎస్ఐ మందుల కొనుగోలులో అవకతవకల వల్ల ప్రభుత్వానికి 151 కోట్ల మేర నష్టం జరిగిందని ఆరోపణ.
అయితే అచ్చన్నాయుడు కుటుంబాన్ని కావాలనే టార్గెట్ చేస్తున్నారని టీడీపీ వారు ఆరోపిస్తున్నారు. టీడీపీ వాణిని అసెంబ్లీలో బలంగా వినిపించే వారిలో అచ్చన్నాయుడు ముందు ఉంటారు. ఇప్పటివరకూ జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్ సైతం ఆయనను డైరెక్టుగా టార్గెట్ చెయ్యడం చూశాం. ఇప్పుడు అరెస్టు కూడా శాసనసభా సమావేశాలకు ముందే జరగడం గమనార్హం.
ఇంతకు కొన్ని రోజుల ముందు…. చంద్రబాబు అచ్చన్నాయుడు అబ్బాయి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుని టీడీపీ అధ్యక్షుడు చెయ్యాలని చంద్రబాబు యోచిస్తున్నారని, దీనితో లోకేష్ చంద్రబాబుతో విబేధించారని వార్తలు వచ్చాయి… విజయసాయి రెడ్డి కూడా అటువంటి వ్యాఖ్యలే చెయ్యడం గమనార్హం.
దీనితో ఒక వ్యూహం ప్రకారమే అచ్చన్నాయుడు కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు అనే వాదన తెర మీదకు తెస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. అచ్చన్నాయుడు కుటుంబంలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నారు. అందరు వాగ్ధాటి కలిగిన వారే. వారిని దారికి తెచ్చుకుంటే…టీడీపీని బలహీనపరచినట్టే అని ప్రభుత్వం వ్యూహం అని వారు ఆరోపిస్తున్నారు.