ఎంఐఎం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగనుంది. మొత్తం 40 స్థానాలకు పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు బెంగళూరులో ప్రకటించాయి. పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ బెంగళూరుకి వచ్చి పార్టీ కర్ణాటక శాఖ నేతలతో చర్చించి అభ్యర్థుల జాబితాను ఒకటిరెండు రోజుల్లో ఖరారు చేయనున్నారు.
ఎంఐఎం ఆ ఎన్నికలలో పోటీ చెయ్యడం కాంగ్రెస్ కు పెద్ద దెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా కాంగ్రెస్ కు గంపగుత్తుగా పడే ముస్లిం ఓట్లను ఎంఐఎం చీల్చి బీజేపీకి లాభం చేకూర్చబోతుంది అనేది బహిరంగ రహస్యమే. గతంలో కూడా ఎంఐఎం వేరే రాష్ట్రాల ఎన్నికలలో ఇదే విధంగా వ్యవహరించింది.
దీనితో ఎంఐఎం బీజేపీకు ఏమన్నా చీకటి ఒప్పందాలు ఉన్నాయా అనే అనుమానాలు కలగడం సహజం. బయటకు మాత్రం ఒకరిపై ఒకరు విరుచుకుపడినా ఒవైసీ మోడీ రహస్య మిత్రులా? అనే అనుమానం కలగకమానదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు పార్టీ విస్తరణకు మజ్లిస్ నేతలు ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. మహారాష్ట్ర విధానసభ ఎన్నికల్లో రెండు స్థానాల్లోనూ ఆపార్టీ గెలిచింది.