అనేక వివాదాల నడుమ విడుదలై, భారీ కలెక్షన్లతో దూసుకుపోతోన్న ‘అర్జున్ రెడ్డి’ సినిమాపై ఇప్పటికే పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ముద్దు సీన్లు, అసభ్యకర డైలాగులు ఉన్నాయని, వెంటనే నిషేధించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ మహిళా నేతలు ఆందోళనలు కూడా నిర్వహించారు. అయితే మరోవైపు ఈ సినిమా కధ నాదేనంటూ ఖమ్మంకు చెందిన దర్శకుడు డి.నాగరాజు వెలుగులోకి వచ్చి మరో వివాదాన్ని తీసుకువచ్చారు.
గతంతో తాను తెరకెక్కించిన ‘ఇక సె..లవ్’ అనే సినిమా కథనే యథాతథంగా తెరకెక్కించారని ఆరోపణలు చేసిన నాగరాజు, వెంటనే ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని… తన అనుమతి లేకుండా తన కథతో సినిమా తీసినందుకు 2 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని… లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు సంబంధించిన దర్శకనిర్మాతలకు నోటీసులు కూడా పంపాడు. అంతేకాదు ‘అర్జున్ రెడ్డి’ అన్న టైటిల్ పెట్టి, ఈ కధను మలిచిన విధానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కథాచౌర్యం చేసిందే గాక, అలాంటి ఆలోచనే వచ్చిందని చెబుతున్నారని, లక్షణమైన తన కథను ముద్దులు, హద్దులు మీరిన సన్నివేశాలతో ఓ ‘పోర్న్ సినిమా’లా తయారు చేసి రిలీజ్ చేశారని మండి పడుతున్నాడు. తాను తీసింది షార్ట్ ఫిల్మ్ కాదని, ఫీచర్ ఫిల్మ్ అని స్పష్టం చేస్తూ… తన వెనుక పెద్ద హీరో లేడు, పెద్ద బ్యానర్ లేదు, భారీగా ఖర్చు చేసే నిర్మాతలు, వివాదం చేసే వ్యక్తులు, ట్వీట్లు చేసే రాంగోపాల్ వర్మ లేరని అన్నారు. తాను ఈ కథను అల్లు అరవింద్, బెల్లంకొండ సురేష్, మారుతి వంటి వారికి చూపించానని చెప్పారు.
పచ్చి బూతులతో సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు, ధియేటర్లు దొరుకుతాయి, సినీ పరిశ్రమ మొత్తం దాని వెంట నిలబడుతుందని ఆవేదన వ్యక్తం చేసారు. రీమేక్ సినిమాను కూడా మక్కీకిమక్కీ చేయలేరని, యేవో కొన్ని మార్పులు ఉంటాయని, అవే మార్పులు “అర్జున్ రెడ్డి”లో కూడా చోటు చేసుకున్నాయని ఆరోపించారు. కథ, కథనం, కథాగమనం మొత్తం తనవేనని తెలిపారు నాగరాజు, నిర్మాతలు రాజీకి వచ్చి 2 కోట్లు ఇస్తే సరేనని, లేని పక్షంలో చట్టపరంగా పోరాడుతానని స్పష్టం చేశారు.