ఎపి ఎన్.జి.ఓ.నేత అశోక్ బాబుపై బిజెపి మండిపడుతోంది.కర్నాటకలో బిజెపికి వ్యతిరేకంగా అశోక్ బాబు ప్రచారం చేయడంపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి జమ్ముల శ్యామ్ కిశోర్ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. అశోక్ బాబు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఉద్యోగ నిబంధనలకు వ్యతిరేకమని తెలిపారు. అశోక్ బాబుతో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇతర ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉద్దేశపూర్వకంగానే అశోక్ బాబు కర్ణాటక, తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని శ్యామ్ కిశోర్ వ్యాఖ్యానించారు. కర్ణాటకలోని తెలుగు ప్రజలకు ఏదైనా జరిగితే అశోక్ బాబు బాధ్యత వహిస్తాడా అని ప్రశ్నించారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే అది తెలుగు వారికి కన్నడ వారికీ ఎందుకు గొడవలు తెస్తుంది.
ఉత్తరాది వారైన మోడీ – అమిత్ షా, తెలుగు వారైన పురందేశ్వరి – మురళీధరరావు అక్కడ బీజేపీకి అనుకూలంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారం చెయ్యడం లేదా? దాని వల్ల ఉత్తరాది వారికి కన్నడ ప్రజలకు గొడవలు వస్తున్నాయా? బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే అక్కడి బీజేపీ వారికి కోపం రావొచ్చు అంతేగాని మొత్తం ప్రజలకి ఎందుకు కోపం వస్తుంది. ఇక్కడి వారు వెళ్లి ఏమైనా అక్కడి స్వతంత్ర సమరయోధులను తిడుతున్నారా?