Telangana BJP President Bandi Sanjay questions kcrఇటీవలే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమితుడైన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇరు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఏపీ, తెలంగాణ సీఎంలు మాఫియా ముఖ్యమంత్రులుగా అవతారమెత్తి రెండు రాష్ట్రాలను సర్వనాశనం చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

“ఏపీ,తెలంగాణ సీఎంలు ఇద్దరు లోపాయికార ఒప్పందం చేసుకొని దోచుకుతింటున్నారు. కేసీఆర్ ను నమ్మి అధికారం అప్పజెప్పితే నీళ్ల పేరుతో నిధులు మాయం చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ సీఎంలు మాఫియా ముఖ్యమంత్రులుగా అవతారమెత్తి రెండు రాష్ట్రాలను సర్వనాశనం చేస్తున్నారు,” అంటూ ఆయన విరుచుకుపడ్డారు.

గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి తెలంగాణలో చర్చ జరగడం లేదు. అయితే జగన్ ప్రభుత్వం తెర మీదకు తెచ్చిన పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు విషయంలో రెండు రాష్టాల మధ్య చిచ్చు రేగింది. దీనితో తెలంగాణ ప్రాంత నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద విమర్శలు చేస్తున్నారు.

ఈ ప్రాజెక్టుపై వివాదం కేంద్రం వరకూ వెళ్ళింది. అయితే ఇరు రాష్ట్రాల సీఎంలు ఈ విషయంలో ఒకరినొకరు వ్యతిరేకించుకుంటున్నట్టు కనిపించినా వారు తెరవెనుక లోపాయికారీ ఒప్పందంతోనే ఇదంతా నడిపిస్తున్నారని తెలంగాణలోని ప్రతిపక్ష నాయకుల అనుమానం.