హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలు సర్వసాధారణమే. అదో నిరంతర ప్రక్రియగా కొనసాగుతూ ఉంటుంది. కనుక ఏపీ, తెలంగాణ, మద్రాస్ హైకోర్టులలో సేవలు అందిస్తున్న ఏడుగురు న్యాయమూర్తులను ఇతర కోర్టులకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియమ్ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ హైకోర్టులో సేవలు అందిస్తున్న జస్టిస్ భట్టు దేవానంద్ మద్రాస్ హైకోర్టుకి, జస్టిస్ డి.రమేష్ అలహాబాద్ హైకోర్టుకి బదిలీ అయ్యారు. వారి బడిల్లీలను నిరసిస్తూ ఏపీ హైకోర్టు న్యాయవాదులు నేడు విధులు బహిష్కరించి ధర్నా చేస్తున్నారు. ఏపీ న్యాయమూర్తుల బదిలీలో వివక్షకు నిదర్శనమని వారు ఆరోపిస్తున్నారు. గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి బదిలీపై వెనక్కు తగ్గిన సుప్రీంకోర్టు కొలీజియమ్ ఏపీ హైకోర్టు న్యాయమూర్తులను మాత్రం మద్రాస్, అలహాబాద్ హైకోర్టులకు బదిలీ చేసిందని వారు ఆరోపిస్తున్నారు.
హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల నిర్ణయం వెలువడిన తర్వాత గుజరాత్, తెలంగాణ హైకోర్టులకు చెందిన న్యాయవాదుల సంఘాల ప్రతినిధులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ట్ చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్లను కలిసి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వినతిపత్రాలు ఇచ్చారు.
కానీ జాతీయ దృక్పదంతో తీసుకొన్న తమ నిర్ణయాలను అందరూ గౌరవించాల్సిందే అని , ఎవరూ నిరసనలు, విధులు బహిష్కరించి ధర్నాలు చేయరాదని జస్టిస్ట్ చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ వారికి స్పష్టం చేశారు. అయితే ఆ తర్వాత గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీని మాత్రం నిలిపివేసి ఏపీ, తెలంగాణ, మద్రాస్ హైకోర్టుల న్యాయమూర్తులను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఏపీ హైకోర్టు న్యాయవాదులు నేడు విధులు బహిష్కరించి నిరసనలు తెలియజేస్తున్నారు.
కానీ న్యాయమూర్తుల బదిలీలను ఏపీ హైకోర్టు న్యాయవాదులు వ్యతిరేకించడానికి కేవలం ‘వివక్ష’ కారణంగా చెపుతున్నారు తప్ప బలమైన కారణం ఏదీ చెప్పడంలేదు. అయినా న్యాయమూర్తుల బదిలీలలో ఇటువంటి నిరసనలు, ఒత్తిళ్ళు అనుమానాలకు, అపోహలకు తావిస్తాయి. ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుంది కూడా.