తెలుగుదేశం పార్టీ వద్దు అంటుంది గనుక ఎలాగైనా టెన్త్ పరీక్షలు జరపాలని కృతనిశ్చయంతో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కరోనా కారణంగా తప్పక వాయిదా వేసిన పరీక్షలను మళ్ళీ ఇప్పుడు ప్లాన్ చేస్తుంది. తాజాగా… జులై 26నుంచి ఆగస్టు 2వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించడానికి ప్రతిపాదనలు చేస్తుంది విద్యాశాఖ.
పరీక్షలకి 6.28 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నరని.. 4 వేల సెంటర్లలో పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని…. 11 పేపర్ల బదులు 7 పేపర్లకి పరీక్షలు నిర్వహిస్తామని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ చినవీరభద్రుడు చెప్పుకొచ్చారు. సహజంగా టెన్త్ క్లాస్ పరీక్షలు మార్చిలో పూర్తయ్యి మే నాటికి ఫలితాలు వచ్చేస్తాయి.
ఆ వెంటనే ఇంటర్ తరగతులు మొదలవుతాయి. ఆగష్టు నాటికి పరీక్షలు పూర్తయితే సెప్టెంబర్ చివరికి ఫలితాలు వస్తాయేమో… ఇక అడ్మిషన్లు పూర్తయ్యి అక్టోబర్ నాటికి తరగతులు మొదలైతే ఆ ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరం సిలబస్ ఎప్పటికి పూర్తి అవుతుంది? పరీక్షలు రద్దు చేసి ఇంటర్ కి ప్రమోట్ చేస్తే ఆ ఎఫెక్ట్ ఒక్క ఏడాదితో పోతుంది.
లేదా ఇంటర్ లో కూడా పిల్లలు ఇబ్బంది పడాలి. ఇక ఖర్మకాలి ఇంకో కరోనా వేవ్ వస్తే ఇంక ఇంటర్ తరగతులు ఏం సాగుతాయి? రాజకీయ లెక్కలు వేసుకుని ఈగోకి పోతే ఈ విషయంగా చాలా అనర్ధాలు జరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో కొంచెం పట్టూవిడుపూ ప్రదర్శిస్తే మంచిది.