ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడానికి జగన్ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించింది. భాషాప్రియులు, ప్రతిపక్ష పార్టీలు దానిని వ్యతిరేకిస్తూ కనీసం తల్లిదండ్రులకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఆప్షన్లు గా ఇవ్వాలని… ఏది కావాలనేది వారికే వదిలేయ్యాలి చెప్పినా ప్రభుత్వం వారి మాట వినలేదు. తాము తలచినదే జరగాలని పట్టుబట్టింది.
అయితే ఈ విషయం చివరకు కోర్టులకు చేరింది. కోర్టులు కూడా అదే చెప్పి ప్రభుత్వం స్పీడ్ కు బ్రేకులు వేశాయి. అయితే కోర్టు ఆదేశాలను బైపాస్ చేస్తూ జగన్ ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తుంది. తెలుగు మీడియం అన్న మాట లేకుండా… ప్రభుత్వ పాఠశాలలో సీబీఎస్ఈ సిలబస్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది.
సీబీఎస్ఈ సిలబస్ ఎలాగూ తెలుగు మీడియం లో ఉండదు కాబట్టి తాము అనుకున్నది నెరవేరుతుందని జగన్ ప్రభుత్వం ఆలోచన. ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న ఈ వార్తను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ధృవీకరించారు. ఈరోజు జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల సందర్భంగా సీఎం జగన్ దీని మీద హింట్ ఇచ్చారు.
“వచ్చే ఏడాది నుంచి సీబీఎస్ఈ సిలబస్ను తీసుకొస్తాం,” అంటూ ఆయన ప్రకటించారు. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం వివాదం ఒకవైపు అయితే కరోనా కారణంగా అసలు క్లాసులు జరగలేని పరిస్థితిలో టీచర్లు, విద్యార్థులు ఒత్తిడిలో ఉన్న తరుణంలో సీబీఎస్ఈ సిలబస్ తీసుకొస్తే వారికి మరింత ఇబ్బందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు.