కాంగ్రెస్ నేతలకు ఆంధ్రప్రదేశ్ మీద ఇంకా ఆశ చావనట్టుగానే ఉంది. రాబోయే ఎన్నికల అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కీలకంగా మారుతుందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి జోస్యం చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెదేపా, వైకాపాల్లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాదన్నారు.
కాంగ్రెస్ పార్టీ నిర్ణయాత్మక శక్తిగా మారుతుందన్నారు. తాము సొంతంగా అధికారంలోకి రాలేకపోయినా.. మా పార్టీ నిర్ణయం మేరకే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. ఈసారి అసెంబ్లీలో కచ్చితంగా అడుగు పెడతామని ధీమా వ్యక్తం చేశారు. అసలు రాజకీయ నిపుణులంతా కాంగ్రెస్ ఈ సారి కూడా ఖాతా తెరవడం కష్టం అంటుంటే వీరికి ఏకంగా ప్రభుత్వ ఏర్పాటు ఆశలే.
మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటన ఈ నెలలో జరగాల్సి ఉన్నా.. అనివార్య కారణాలతో వాయిదా పడిందన్నారు. సెప్టెంబరులో ఆయన రాష్ట్రానికి వస్తారని సమాచారం. ఇంకో వైపు కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీ పొత్తు పెట్టుకుంటాయని బీజేపీ వారు ప్రచారం చేస్తున్నారు. దీని వల్లే రఘువీరా సంకీర్ణ ప్రభుత్వం అంటున్నారా?