రాష్ట్ర ప్రభుత్వం చేసిన మూడు రాజధానుల ప్రకటన పై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. రాజధానికి భూములిచ్చిన 25,000 కు పైగా రైతులు ఈ ప్రకటనతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ విషయంలో రకరకాలుగా స్పందిస్తున్నాయి. వారు కూడా ప్రాంతాల వారీగా విడిపోవడం విశేషం.
బిజెపి ఉపాద్యక్షుడు విష్ణువర్దనరెడ్డి ఈ విషయంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీని గందరగోళంలో పెట్టడానికి గాను జగన్ మూడు రాజదానుల అంశం తెరపైకి తెచ్చారని ఆయన అన్నారు.ప్రజలకు ఉపయోగపడే ప్రకటనలు రావాలని ఆయన అన్నారు.
అభివృద్ధి వికేంద్రీకరణా? లేక అధికార వికేంద్రీకరణా? అనే సందిగ్ధంలో ప్రజలు ఉన్నారని చెప్పారు. జిరాక్స్ మిషన్లు, 4 న్యాయవాదుల భవనాలు తప్ప కర్నూలుకు హైకోర్టుతో ఏం లాభమని ఆయన అనడం విశేషం. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే… గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ నాయకులు తరచుగా కర్నూల్ లో హై కోర్టు పెట్టాలని డిమాండ్ చేసేవారు.
ఇప్పుడు ఆ విషయంలో వారు యూ టర్న్ తీసుకోవడం విశేషం. బీజేపీ వాదన పక్కన పెడితే హై కోర్టు కర్నూల్ లో పెట్టి హై కోర్టు బెంచ్లు విశాఖలోనూ, అమరావతిలోనూ పెట్టడం వల్ల కర్నూల్ కు ఈ ప్రతిపాదన ఎంతవరకూ ఉపయోగం అనేదాని మీద చర్చ జరుగుతుంది.