ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతల మాటలు కోటలు దాటుతాయి అయితే చేతలు మాత్రం గడపలు దాటవు. టిడిపి అధినేత చంద్రబాబు ఎన్నికల ముందే చేతులు ఎత్తేశారని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు అస్త్ర సన్యాసం చేశారని ఆయన విమర్శించారు.
కరోనా వైరస్ అంటూ ఎన్నికలను వాయిదా వేయాలని టీడీపీ నేతలు కోరడాన్ని విష్ణువర్ధన్ రెడ్డి తప్పుబట్టారు. ఎన్నికలకు భయపడే చంద్రబాబు వెనకడుగు వేస్తున్నారని విమర్శలు గుప్పించారు. కరోనా వైరస్ ప్రభావం ఏపీలో లేకపోయినప్పటికీ.. కరోనా అంటూ టీడీపీ అధికార ప్రతినిధులు విపక్షాలను బలహీన పరుస్తున్నారని ఆయన అన్నారు
సరే స్థానిక ఎన్నికలకు చంద్రబాబు భయపడుతున్నాడు అనే అనుకుందాం. ఆ విషయం పక్కన పెడితే ప్రతిపక్షాలను చంద్రబాబు బలహీనపరుస్తున్నారు అనేది అసలు కామెడీ అని టీడీపీ వారు అంటున్నారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎలా జరిగినా అసలు నష్టం లేనిది బీజేపీకి… ఎలాగూ ఆ పార్టీకి వచ్చేది చచ్చేది ఏమీ లేదు అని వారు ఆక్షేపిస్తున్నారు.
“బహుశా జనసేనతో పొత్తుతో నాలుగు సీట్లు రాబట్టాలని బీజేపీ వ్యూహం కావొచ్చు. అయితే జనసేనకు గ్రామ స్థాయిలో పార్టీ నిర్మాణం లేదు.ఇటీవలే ఎన్నికల ప్రభావంతో పడే ఓట్లు కూడా పడతాయంటే అనుమానమే. ఇటువంటి తరుణంలో చంద్రబాబు ప్రతిపక్షాలను బలహీన పరుస్తున్నారు అని ముందే బీజేపీ నాయకులు వంకలు వెతుకుంటున్నారు కావొచ్చు,” అని వారు అంటున్నారు.