రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ ఉనికి అంతంత మాత్రమే. తెలంగాణ లో మొన్న ఆ మధ్య జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో మంచి ఫలితాలు వచ్చినా.., ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికలలో ఆ పార్టీ డిపాజిట్లు కోల్పోవడంలో రికార్డు సృష్టించింది. పార్టీ అధినేత, కీలక నేతలు కూడా ఎన్నికలలో పోటీ చేసి డిపాజిట్ దక్కించుకోలేకపోయారు.

ఆ తరువాత ప్రేక్షాళన పేరుతో పార్టీలో మార్పులు తెచ్చారు. కన్నా లక్ష్మీనారాయణను తప్పించి ఆయన స్థానములో సోము వీర్రాజుని అధ్యక్షుడిగా చేశారు. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ కు అనుకూలంగా టీడీపీ అధికారంలో ఉన్నట్టుగా రోజు చంద్రబాబు మీద విమర్శలతో వార్తలలో ఉండేవారు. అయితే మొన్న ఆ మధ్య వీర్రాజుకు కరోనా సోకిందంట.

ఆయన పరిస్థితి గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటనా చెయ్యకపోయినా చాలా రోజులుగా ఆయన బయటకు రాకపోవడంతో సీరియస్ గా ఉందని వార్తలు వస్తున్నాయి. ఆ విషయం పక్కన పెడితే వీర్రాజు మీడియా ముందుకు రాని రోజులలో పార్టీ పూర్తిగా స్తబ్దుగా మారిపోయింది. కనీసం మీడియా ముందుకు రావడానికి కూడా నేతలకు టైం ఉండటం లేదు.

అసలు కరోనా సోకింది ఒక్క వీర్రాజుకేనా లేక మొత్తం ఏపీ బీజేపీకా అనే అనుమానాలు రప్పిస్తున్నారు. అయితే ఇందుకు కారణం లేకపోలేదు అంటున్నారు ఆ పార్టీ నేతలు… పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిందని… వీర్రాజు ఆయన కోటరీ తప్ప ఎవరినీ పొసగనివ్వడం లేదని… ఎవరైనా స్వతంత్రంగా వ్యవహరిస్తే ఏదో వంకతో సస్పెండ్ చేస్తున్నారని… అందుకే మనకెందుకులే అని చాలా మంది నేతలు సైలెంట్ అయిపోయారని చెప్పుకొస్తున్నారు.