‘తానూ పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు’ అన్న చందంగా అసెంబ్లీలో తొలి రోజు వ్యవహరించిన వైసీపీ, రెండవ రోజు కూడా అదే తీరుతో కొనసాగించింది. ‘ప్రత్యేక హోదా’పై చర్చకు పట్టుబట్టిన వైకాపా, ప్రభుత్వం అందుకు అంగీకారం తెలపకపోవడంతో వైకాపా సభ్యులు స్పీకర్ పోడియంలోకి దూసుకువచ్చారు. ఈ క్రమంలో స్పీకర్ కు చుట్టూ నిలబడిన మార్షల్స్ పై వైకాపా సభ్యులు దాడి చేశారు. దీంతో ఒకింత ఆగ్రహానికి గురైన కోడెల, “మార్షల్స్ పై దాడి చేయవద్దు” అని పదే పదే విజ్ఞప్తి చేశారు.
మీకు సభ్యత ఉంటే దయచేసి కూర్చోవాలని, ప్రభుత్వం హోదాపై చర్చకు సిద్ధమేనని, అసెంబ్లీ ప్రశ్నోత్తరాల తరువాత, ప్రకటన చేసిన అనంతరం చర్చిద్దామని కోడెల వెల్లడించినా వైకాపా సభ్యులు అందుకు అంగీకరించలేదు. మీరు చాలా పొరపాటు చేస్తున్నారని, ఈ దౌర్జన్యం సరికాదని వైకాపా సభ్యులను ఉద్దేశించి కోడెల వ్యాఖ్యానించారు. కనీసం సీనియర్ సభ్యులయినా పోడియంలోకి వచ్చిన వారిని వెనక్కు పిలుచుకోవాలని చెప్పినప్పటికీ ప్రయోజనం లేకపోలేదు.
ఎన్ని సార్లు వైసీపీ సభ్యులను విజ్ఞప్తి చేసినప్పటికీ, పరిస్థితి అదుపులోకి రాకపోయే సరికి పది నిమిషాల పాటు సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. మార్షల్స్ పై తిరగబడడం సిగ్గుచేటు ప్రక్రియగా పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి. తొలి రోజు మొత్తం ఇలాగే సభా సమయాన్ని వృధా చేసిన ప్రతిపక్షం, రెండవ రోజు కూడా అదే తీరుతో ముందుకు రావడం వారి చిత్తశుద్ధిని చాటుకుంటోంది.