శాసనసభలో ప్రజల కష్టనష్టాల గురించి చర్చలు జరుపుతారు, అందుకు అనుగుణంగా ఆయా సమస్యల పైన పరిష్కార మార్గాలను అన్వేషించి, జీవోల రూపంలో బిల్లులను పాస్ చేస్తారు. ఇది సింపుల్ గా ఏ రాష్ట్ర అసెంబ్లీలో అయినా చేసే ప్రక్రియ. అయితే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు అనేవి ఒక వినోదభరితమైన అంశంగా మారిపోయాయి.

చాలా రాష్ట్రాలలో ఇదే పరిస్థితి నెలకొన్నా, జగన్ సారధ్యంలోని ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇందులో మొదటి స్థానంలో నిలిచిందన్నది నెటిజన్ల అభిప్రాయం. ఎందుకంటే గత కొన్ని రోజులుగా అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రసంగిస్తోన్న విధానం, టీవీలో ప్రసారమయ్యే ‘జబర్దస్త్’ షో మాదిరి కామెడీగా మారిపోయిందని చేస్తోన్న కామెంట్స్ కు సోషల్ మీడియాలో కొదవలేదు.

తాజాగా ఈ జాబితాలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి చేరారు. బహుశా ఈ పేరు చెప్తే ఎవరూ గుర్తు పట్టకపోవచ్చు గానీ, “గ్రీకువీరుడు” అంటే మాత్రం నెటిజన్లు ఠక్కున పట్టేస్తారు. అంతగా నెటిజన్లను నవ్వించడంలో ఈ ఎమ్మెల్యే గారు సూపర్ సక్సెస్ అయ్యారు. ఆ మాటకొస్తే నెటిజన్లనే కాదు, స్పీకర్, సీఎం, అసెంబ్లీ ఫ్లోర్ అంతా కూడా ఈయన గారి వ్యాఖ్యలకు పడిపడి నవ్వారు.

శాసనసభలో వీరంతా నవ్వుకుని ఉండొచ్చు గానీ, ప్రజల దృష్టిలో నవ్వులపాలు అవుతున్నారన్న విషయం వైసీపీ ఎమ్మెల్యేలు గుర్తించడం లేదు. ఈ కామెడీ అంతా ఒకే లైన్ మీద రన్ అవుతోంది, అదే జగన్ కు భజన చేసే క్రమంలో! ఎలా అయినా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పడాలన్న తాపత్రయం అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేస్తోన్న ‘కామెడీ’లో కనపడుతోంది.

ఇదే తాపత్రయం ప్రజలకు సేవ చేసేందుకు గానీ, అవసరమైన సమయంలో ప్రజలను ఆదుకునేందుకు గానీ చూపితే, ప్రజలే నెత్తిన పెట్టుకుంటారు. ఎంతో చరిత్ర, ఇంకెంతో విశిష్టత కలిగిన శాసనసభ, నేడు ఇలా కామెడీ ‘జబర్దస్త్’ షోను తలపించడం శోచనీయం. ప్రజలు ఎలాంటి వారిని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నారో ఈ సభ మరోసారి వెలుగులోకి తీసుకువచ్చింది.

విశేషం ఏమిటంటే… ఈ పొగడ్తల పోటీలలో ఎవరి స్టైల్ వారిదే. ఒకరు పద్యాలు చదువుతూ వినోదాన్ని పంచుతారు, మరొకరు ఏకంగా 3వ దశాబ్దానికి వెళ్ళిపోతారు, ఇంకొకరు మనమే భూ కబ్జాలు చేసేశామని అంటారు… ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితాకు అంతం ఉండదు. అంతేలే… చూసి చదవడంలో ఏకంగా ముఖ్యమంత్రి గారే కామెడీ చేయగా, ఎమ్మెల్యేలు వీరెంత! యధా సీఎం… తధా ఎమ్మెల్యేలు..!