‘జబర్దస్త్’ బ్యూటీ రష్మి సెంట్రాఫ్ అట్రాక్షన్ గా జరిగిన పబ్లిసిటీతో “అంతకు మించి” మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఫలితం పక్కన పెడితే, తాజాగా ఈ మూవీ ఆర్ధిక వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన గౌరీకృష్ణప్రసాద్ ఇబ్బందులతో, సినిమా మధ్యలోనే ఆగిపోగా, చిత్ర హీరో సతీష్ జాయ్ నిర్మాతగా వ్యవహరించేందుకు అంగీకరించి సినిమాను పూర్తి చేసాడు.
అయితే అంతకుముందు సినిమాకు ఖర్చు పెట్టిన 50 లక్షల రూపాయలను హీరో సతీష్ జాయ్ నిర్మాత గౌరీకృష్ణప్రసాద్ ఇచ్చేందుకు అంగీకరించగా, ఇపుడు సదరు మొత్తం చెల్లించకుండానే సినిమాను రిలీజ్ చేసుకున్నారంటూ హైదరాబాద్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు చేసారు. నిజానికి ఈ సినిమా విడుదల ఆపేయాలని రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు ఇచ్చిందని, ఆ నిబంధనలను కూడా విభేదిస్తూ హీరో సతీష్ సినిమాను విడుదల చేసినట్లుగా నిర్మాత ఆరోపించారు.
తనకు రావాల్సిన 50 లక్షల రూపాయల గురించి అడుగుతుంటే, తనకు కేసులు, కోర్టులు కొత్త కాదు, ఏం చేయాలో, ఎలా చేసుకోవాలో తనకు తెలుసని, తనకు రాజకీయ నాయకులు తెలుసంటూ హీరో సతీష్ బెదిరిస్తున్నట్లుగా నిర్మాత గౌరీ కృష్ణప్రసాద్ మీడియాకు వివరించారు. మరి ఇందులో హీరో గారి వర్షన్ ఎలా ఉంటుందో చూడాలి. అయితే సినిమాకు లభించిన టాక్ రీత్యా ఇదేమి పబ్లిసిటీ స్టంట్ కాదు కదా? అన్నది కూడా లేకపోలేదు.