డిసెంబర్ 1వ తేదీన పోలవరం పూర్తి చేస్తామని అసెంబ్లీ వేదికగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు గత మూడు, నాలుగు రోజులుగా సోషల్ మీడియాను చుట్టేసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ వైరల్ అవుతోన్న ఈ వీడియోపై ఏబీఎన్ ఛానల్ ‘నెటిజన్స్ ‘ట్రోల్’ చర్చ చేపట్టగా, దానికి ప్రతిగా మంత్రి అనిల్ కుమార్ స్పందించారు.
‘టిడిపి అగ్ర నాయకత్వం అంతా నిన్న ఇదే అంశాన్ని పట్టుకున్నారని, అది నెటిజన్స్ చేసిన ట్రోల్ కాదని, అది నీ పిచ్చ ఆర్మీ చేసిన ట్రోల్ అని, అయినా ట్రోల్ చేస్తే ఏమవుతుంది? దానికి మేమేలు పెట్టడం, ఎందుకురా ఇంత కష్టపడి గొంతు చించుకుని పీకులాట పెట్టుకోవడం? ఇదే ఏబీఎన్ రాధాకృష్ణను అడుగుతున్నా… ఏం పీకుతావ్, నీకు ఇష్టం వచ్చినట్టు రాసుకో” మళ్ళీ తనదైన ఎటకారపు డైలాగ్స్ ని పలికించారు మంత్రి గారు.
తెలుగుదేశం పార్టీనో లేక నెటిజన్ల ట్రోలింగో… ఏదైనా గానీ మంత్రి గారు స్వయానా పోలవరం పూర్తి చేస్తామని చెప్పిన మాటలే కాబట్టి, ఇప్పుడు టిడిపి వర్గాలకు ఎలా అయితే బదులిచ్చారో, పోలవరంకు సంబంధించి కూడా ప్రజలకు బదులు చెప్పాల్సిన బాధ్యత మంత్రిగా అనిల్ కుమార్ పై ఉంది. ఎందుకు ఆలస్యం అయ్యిందో, ఆ జాప్యంలో ఎవరెవరు ఉన్నారో సవివరంగా ప్రజలకు చెప్పగలిగితే టిడిపి ట్రోల్స్ ను గానీ, నెటిజన్ల ఆవేదనకు గానీ, ఆ మాటకొస్తే ఏబీఎన్ కధనాలకు గానీ ప్రాధాన్యత ఉండదు కదా!
జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి కేంద్రం ఇస్తున్న సహకారం ఏమిటో, రాష్ట్రం చేపడుతున్న చొరవ ఏమిటో, ఇందులో ఎవరి పాత్ర ఎంతవరకు ఉందో తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలా కాకుండా అంశాన్ని పక్క దారి పట్టించే విధంగా మళ్ళీ మళ్ళీ అదే వ్యంగ్యాస్త్రాలను వదిలితే, టీడీపీ చేస్తోన్న విమర్శలకు గానీ, ఆరోపణలకు గానీ, నెటిజన్ల ట్రోలింగ్ కు గానీ బలం చేకూరినట్లే కదా! ఈ చిన్న లాజిక్ ను మంత్రి గారు ఎలా మిస్ అయ్యారో!