andhrapradesh sunrise stateరాజధాని కాదు కదా.., కనీసం పరిపాలనకు సంబంధించిన వసతులు కూడా లేని ఆంధ్రప్రదేశ్ సరికొత్త పయనం ప్రారంభించి ఇప్పటికే ఏడాదిన్నర దాటిపోయింది. అమరావతి పేరిట నూతన రాజధాని నిర్మాణానికి పక్కా ప్లాన్ రూపొందించుకోగలిగిన ఏపీ, ఇక తన ప్రయాణంలో మరింత వేగాన్ని పెంచింది. ఇదే సమయంలో అప్పటిదాకా ఉమ్మడి రాష్ట్రం హయాంలో “ప్రగతి చక్రాన్ని” తన అధికారిక చిహ్నంగా ఎంచుకున్న రాష్ట్ర ప్రజలు, తాజాగా మరో రకమైన ప్రగతి చక్రం కింద పరుగులు పెట్టనున్నారు. అదే… ‘సన్ రైజ్ స్టేట్’.

నవ్యాంధ్ర రాష్ట్ర అధికారిక చిహ్నంగా ‘సన్ రైజ్ స్టేట్’ దాదాపుగా ఖరారైందని విశ్వసనీయ సమాచారం. నవ్యాంద్ర వాణిజ్య రాజధాని విశాఖలో రేపటి నుంచి భాగస్వామ్య సదస్సు పేరిట పారిశ్రామిక సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. ఈ ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులకు ప్రవేశ ద్వారం వద్దే ‘సన్ రైజ్ స్టేట్’ చిహ్నం మంత్రముగ్ధులను చేసింది.

దీంతో అక్కడి అధికారులతో మాట కలిపిన మీడియా, ఆ చిహ్నమే నవ్యాంధ్ర రాజధాని అదికారిక చిహ్నంగా మారనుందని తెలుస్తోంది. రేపు భాగస్వామ్య సదస్సును ప్రారంభించేందుకు విశాఖ వెళుతున్న చంద్రబాబు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.