ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. సమర్ధవంతంగా పని చేస్తున్నాం అని ప్రభుత్వం చెబుతున్నాం అని చెబుతున్నప్పటికీ కేసుల సంఖ్యలో అది కనిపించడం లేదు. రోజుకు 2000 కేసులకు పైగా నమోదు అయ్యే అవకాశం కనిపిస్తుంది. దీనికి కారణం వాలంటీర్ల వ్యవస్థ వైఫల్యం అంటున్నారు.
టెస్టులు ఎక్కువగా చేస్తున్నప్పటికీ ఆ ఫలితం కేసులలో కనిపించడం లేదు. అనుమానిత కేసుల సాంపిల్స్ సేకరించిన నాటి నుండీ ఫలితం రావడానికి కనీసం 3-4 రోజులు పడుతుంది. ఈలోగా సదరు వ్యక్తి ఇంట్లోనే ఉండాల్సి ఉండగా మెజారిటీ కేసులలో అలా జరగడం లేదు. లక్షణాలు లేని వారు బయట తిరగడంతో వ్యాధి మరింతగా వ్యాప్తి చెందుతుంది.
ఒక్కో వాలంటీర్ కు యాభై ఇళ్ళు కేటాయించింది ప్రభుత్వం. ఆ యాభై ఇళ్లలలో ఎవరైనా శాంపిల్ ఇచ్చినా లేదా పాజిటివ్ వచ్చినా హోమ్ క్వారంటైన్ అమలు చెయ్యాల్సింది వాలంటీర్లే. అయితే ఇప్పటికే ఈ తంతు నాలుగు నెలలుగా జరగడంతో విసిగిపోయారో లేక అలిసిపోయారో తెలీదు గానీ అది సమర్ధవంతంగా జరగడం లేదని పలువురి అభిప్రాయం.
కరోనా పై పోరులో మనం ఇంకా లక్ష్యానికి చాలా దూరంలోనే ఉన్నాం. కనుచూపు మేరలో ఈ సమస్యకు పరిష్కారం కనిపించడం లేదు. ఈ సమయంలో వాలంటీర్లు లేదా ప్రభుత్వ అధికారులు అలిసిపోవడం లేదా నిర్లక్ష్యం చెయ్యడం చాలా ప్రమాదకరం. వారిని ఉత్తేజితులను చెయ్యడానికి ప్రభుత్వం కొత్త ఆలోచనలు చెయ్యాల్సిన సమయం వచ్చింది.