అందరు ఆసక్తిగా ఎదురు చుసిన ఆంధ్రప్రదేశ్ కాబినెట్ సమావేశం, అమరావతి మరియు మూడు రాజధానుల ప్రతిపాదనపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. సుమారు రెండు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో పలు కీలక విషయాలు.. ముఖ్యంగా మూడు రాజధానుల వ్యవహారంపై నిశితంగా చర్చించినట్లు తెలుస్తోంది.
జీఎన్ రావు కమిటీ రిపోర్టు తో పాటు మూడవ తేదీన వచ్చే బీసీజీ నివేదికను ప్రభుత్వం నియమించే ఒక హై పవర్ కమిటి నిశితంగా పరిశీలించి ఒక ఫైనల్ రిపోర్టుని ప్రభుత్వానికి అందజేస్తుంది. సంక్రాంతి పండుగ తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి మూడు రాజధానులపై ప్రకటన చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో అమరావతికి శాసనసభ ఆమోదం ఉంది కాబట్టి ఇప్పుడు కూడా అదేవిధంగా చెయ్యాలని ప్రభుత్వం భావిస్తుంది. జీఎన్ రావు కమిటీకి ఎటువంటి చట్టబద్దత లేకపోవడంతో ప్రభుత్వం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కేబినెట్ భేటీకి ముందు మంత్రివర్గ ఉపసంఘం సీఎం వైఎస్ జగన్తో భేటీ అయింది.
చంద్రబాబు పాలనలో అవినీతిపై మంత్రివర్గ ఉపసంఘం సీఎం వైఎస్ జగన్కు నివేదిక అందజేసింది. రాజధానిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ కు సంబంధించిన ఆరోపణలపై ప్రభుత్వం న్యాయనిపుణుల సలహా తీసుకుని సిబిఐకి అప్పగించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.