ap telangana constituencies extensionsఏపీ విభజన చట్టంలో పేర్కొన్న ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ స్థానాల పెంపునకు సంబంధించిన ఫైలు ప్రధానమంత్రి కార్యాలయానికి చేరింది. ప్రధాని నరేంద్ర మోడీ సూచనలతో ఈ నెలలోనే సదరు బిల్లు పార్లమెంటుకు రానుంది. ఆర్టికల్ 170ని సవరించడం వల్ల తలెత్తే లాభనష్టాలతో పాటు విభజన చట్టంలోని సెక్షన్ 26ని సవరిస్తే భవిష్యత్తులో ఎదురయ్యే న్యాయపరమైన ఇబ్బందుల గురించి వివరిస్తూ కేంద్ర హోంశాఖ ఈ ఫైల్‌ను వారం క్రితమే ప్రధాని కార్యాలయానికి పంపింది.

ప్రధాని సూచనలకు అనుగుణంగా బిల్లును తయారుచేస్తామని, ఒకవేళ ప్రధాని రాజ్యాంగ సవరణకు మొగ్గుచూపితే దాని ప్రకారం బిల్లులో అంశాలు చేరుస్తామని హోం శాఖ సీనియర్ అధికారులు చెబుతున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170లోని సెక్షన్ 3 ప్రకారం 2026 వరకు ఏ రాష్ట్రంలోనూ అసెంబ్లీ, పార్లమెంటు నియోజక వర్గాల పెంపు కుదరదు. అయితే 2014 తర్వాత ఏర్పడిన కొత్త రాష్ట్రాలకు సెక్షన్ 3 నుంచి మినహాయింపు ఇస్తూ నాలుగో సెక్షన్‌ను చేరిస్తే సమస్య పరిష్కారమవుతుందని చెబుతున్నారు.

ఇందుకోసం పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ ఉంటే సరిపోతుందని హోంశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అధికారులు చెప్పిన మెజారిటీ ఎలాగూ బిజెపికి ఉంది కాబట్టి, ప్రధాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా… అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అసెంబ్లీ నియోజక వర్గాలపై జరుగుతున్న తాజా పరిణామాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలోని ‘జంపింగ్’ రాజకీయ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయం లోపున నియోజకవర్గాలు పెరిగితే చాలనుకుంటున్నారు.