Andhra Pradesh signs MoUs for investments worth Rs 1.95 lakh cr chandrababu naiduవిశాఖపట్నం వేదికగా జరుగుతున్న ‘సన్ రైజ్ ఏపీ’ పెట్టుబడుల సదస్సులో భాగంగా తొలి రోజున 32 కంపెనీలతో ఆంధ్రప్రదేశ్ సర్కారు 1.95 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకోగా, మరో 49 ఒప్పందాలు నేడు ‘క్యూ’లో ఉన్నాయి. కుదుర్చుకున్న 32 సంస్థలతో ఒప్పందాలతో 95 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు.

విశాఖపట్టణం జిల్లా రాంబిల్లిలో 5 వేల కోట్ల రూపాయలతో నౌకాదళ స్థావరం ఏర్పాటు చేయనున్నామని రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ వెల్లడించారు. అలాగే మరో 10 వేల కోట్ల రూపాయలు రక్షణ ఉత్పత్తుల రంగంలో పెట్టుబడులు పెడతామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ను పెట్టుబడుల అనుకూల రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి అభినందనీయమని అనిల్ అంబానీ ప్రశంసలు కురిపించారు.

నెల్లూరు, అనంతపురం జిల్లాల పరిధిలో ఆమోటోటివ్, ఎయిర్ స్పేస్ పరికరాల తయారీకి భారత్ ఫోర్జ్ డీల్ కుదుర్చుకుంది. విద్యుత్, సంప్రదాయేతర ఇంధన వనరుల విభాగంలో 22 ఒప్పందాలు కుదిరాయి. గనుల రంగంలో 1, పరిశ్రమల రంగంలో 9 ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన మరో సంస్థ కర్నూలు జిల్లాలో బంగారం వెలికితీతకు రూ. 300 కోట్ల విలువైన ఏపీ సర్కారుతో డీల్ పై సంతకాలు చేసింది.

నవ్యాంధ్ర రాజధాని ‘అమరావతి’లో ఇంధన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని వెల్లడించిన చంద్రబాబు, భవిష్యత్తులో రాష్ట్రం సౌర విద్యుత్ కేంద్రంగా మారనుందన్న ధీమాను వ్యక్తం చేశారు. మొత్తం 300 మందికి పైగా విదేశీ ప్రతినిధులు, 1100 మందికి పైగా దేశీయ ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరైనట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. వచ్చే ఏడాది కూడా ఈ సదస్సును విశాఖలోనే నిర్వహించాలని కేంద్రమంత్రి స్మృతి ఇరానీని ఏపీ సిఎం కోరారు. ఇలాంటి సదస్సుల వలన రాష్ట్రం ప్రయోజనకారి అవుతుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రస్తావించారు.