అమరావతిలో ఉండే సచివాలయంలో మరోసారి వర్షపు నీరు లీకైంది. సచివాలయం నాల్గవ బ్లాక్లోని మంత్రుల పేషీల్లో వర్షపు నీరు చేరింది. గత రెండు రోజులుగా విపరీతంగా వర్షాలు పడుతుండడంతో పలువురు మంత్రుల చాంబర్లలోకి నీరు వచ్చి చేరిందని సమాచారం. మంత్రులు గంటా శ్రీనివాసరావు, అమర్నాథ్రెడ్డి, దేవినేని ఉమ ఛాంబర్ల్లో సీలింగ్ ఊడిపడి, ఏసీల్లోకి వర్షపు నీరు వచ్చిచేరింది.
4, 5వ బ్లాకుల్లోని పలు సెక్షన్లలో సీలింగ్ ఊడిపడింది. అసెంబ్లీ బిల్డింగ్లోనూ పలు చోట్ల సీలింగ్ ఊడిపోయి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. లీకేజీతో అసెంబ్లీ మొదటి అంతస్తులోని రిపోర్టింగ్ సెక్షన్లోకి వర్షలు నీరు వచ్చి చేరుతోందని మీడియాలో కధనాలు వస్తున్నాయి.
గతంలో కూడా గంటా ఛాంబర్లోకి వర్షపు నీరు వచ్చిన సంగతి తెలిసిందే. సచివాలయంలోకి నీరు చేరడం ఇదే మొదటి సారి కాదు. అయినా ప్రభుత్వం, సీఆర్డీఏ అధికారులు మరమ్మత్తులు చేపట్టకపోవడం నిర్లక్షమనే అనుకోవాలి. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నా ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం శోచనీయం.