andhra-pradesh-second-state-to-achieve-100-electrificationదేశంలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా గుజరాత్ అగ్రభాగాన కొనసాగుతూ… మిగులు బడ్జెట్ గల రాష్ట్రంగా రికార్డులకెక్కగా, ఈ విభాగంలో రెండవ రాష్ట్రంగా తెలంగాణా ఖ్యాతినందుకుంది. కాగా, విద్యుదీకరణ విషయంలోనూ గుజరాత్ ప్రధమ స్థానంలో ఉండగా, రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. దేశవ్యాప్తంగా గృహాల విద్యుదీకరణపై సర్వే నిర్వహించిన జేఎం ఫైనాన్షియల్స్, తన తాజా నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.

ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జూన్ చివరి నాటికే రాష్ట్రం 100 శాతం విద్యుదీకరణ లక్ష్యాన్ని సాధించిందని, ఇక ప్రపంచ స్థాయి నాణ్యతతో కూడిన విద్యుత్ సరఫరాపై దృష్టిని సారించాల్సి వుందని తెలిపారు. సామాజిక, ఆర్థికాభివృద్ధిలో విద్యుదీకరణ కీలకమైన అంశమని గుర్తు చేసిన బాబు, దీన్ని త్వరితగతిన సాధించిన అధికారులకు అభినందనలు తెలిపారు.

విద్యుత్ రంగంలో గడచిన రెండేళ్లలో రాష్ట్రం సాధించిన అభివృద్ధి భవిష్యత్తులోనూ కొనసాగాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఇదిలా ఉంటే, ఇప్పటికీ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, ఒడిశా, అసోం రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో 35 శాతం గృహాలకు విద్యుత్ సరఫరా లేదని జేఎం ఫైనాన్షియల్స్ వెల్లడించింది.