ఇకపై వృద్దులు తమ పెన్షన్ ల కోసం లంచాలు ఇవ్వవలసిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. జన్మభూమి కమిటీల మాఫియాతో పని లేదని, సెప్టెంబర్ ఒకటి నుంచి వృద్దుల ఇళ్లకే పెన్షన్ తీసుకుని వెళ్ళి అందచేసే కార్యక్రమం ఆరంభం అవుతుందని చెప్పడానికి గర్వపడుతున్నామని ఆయన తెలిపారు. ఇందుకోసం వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని, వీరు ఎవరైనా లంచం తీసుకుంటే వారిని తీసివేస్తామని ఆయన చెప్పారు.
అయితే విశ్లేషకుల ప్రకారం ఇది ప్రభుత్వం తీసుకుంటున్న రిస్క్ అనే అంటున్నారు. దేశమంతా బ్యాంకు అకౌంట్లలోకి నగదు బదిలీ వైపు వెళ్తుంటే వృద్దుల ఇళ్లకే పెన్షన్ తీసుకుని వెళ్ళి అందచేసే కార్యక్రమం ఎందుకనేది ఇప్పుడు వచ్చే ప్రశ్న. అటువంటి వ్యవస్థ అవినీతికి తావు అనేది లేకుండా ఉంటుంది. గత ప్రభుత్వం ఎలా జన్మభూమి కమిటీలలో తమ సొంత నాయకులను పెట్టుకుని ఇబ్బందులు తెచ్చుకుందో ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తమ పార్టీ క్యాడర్ కే ఈ వలంటీర్ల పోస్టులు ఇచ్చే అవకాశం ఉంది.
వారి మీద ఆరోపణలు వచ్చినప్పుడు చర్యలు తీసుకోవడం అంత తేలికైన వ్యవహారం ఏమీ కాదు. ఈ విషయం చంద్రబాబు నాయుడు విషయంలోనే నిరూపితం అయ్యింది. ముఖ్యమంత్రి పెన్షన్ల విషయంలో నగదు బదిలీ వైపు ఆలోచిస్తే మంచిది. మరోవైపు గత ప్రభుత్వం వెళ్ళిపోతూ 2000 రూపాయిలు చేసిన పెన్షన్ ను 2250 రూపాయలకు పెంచింది జగన్ ప్రభుత్వం. ఏడాదికి 250 రూపాయిల చప్పున 3000 వరకూ పెంచుకుంటూ పోతామని ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ప్రకటించారు.