ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. 175 సీట్లు ఉన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 151 సీట్లు గెలుచుకుంది ఆ పార్టీ. అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శాసనమండలిని రద్దు చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్ద కూడా ప్రస్తావించారట. దీనికి ఆయన కూడా సుముఖంగానే ఉన్నట్టు సమాచారం. మండలిలో తెలుగుదేశం పార్టీకి ఆధిక్యం ఉంది.
51 సభ్యులు కలిగిన మండలిలో టీడీపీకి 31 స్థానాలు ఉండగా, వైఎస్సార్ కాంగ్రెస్ కు కేవలం ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు. దీనితో మండలిలో బిల్లులకు ఆ పార్టీ అడ్డు తగిలే అవకాశం ఉండటంతో జగన్ పూర్తిగా మండలిని రద్దు చెయ్యాలని భావిస్తున్నారు. కేంద్రంలో కూడా లోక్ సభలో బీజేపీకి మెజారిటీ ఉంటే రాజ్యసభలో మాత్రం లేదు. దీనితో జగన్ చెబుతున్న ఇబ్బంది ఏంటో ప్రధాని నరేంద్ర మోడీకి బాగా తెలుసు. మండలిని రద్దు చెయ్యాలంటే రాజ్యాంగాన్ని సవరించాలి కాబట్టి అది కేంద్ర పరిధిలోకి వస్తుంది.
1958లో ఆవిర్భవించిన మండలి 27 ఏళ్ళ తరువాత ఎన్టీఆర్ ప్రభుత్వంలో రద్దు చెయ్యబడింది. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక మళ్ళీ మండలిని పునరుద్ధరించారు. ఇప్పుడు జగన్ మళ్ళీ రద్దుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ అదే గనుక జరిగితే చంద్రబాబు నాయుడు రాజకీయ వారసుడు లోకేష్ ను పూర్తిగా నిలువరించవచ్చు. గతంలో ఎమ్మెల్సీగా మంత్రి అయిన లోకేష్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆయనకు ఎమ్మెల్సీ పదవి మాత్రం ఉంది. ఇప్పుడు మండలిని రద్దు చేస్తే అది కూడా లేకుండా పోతుంది.