సహజంగా ప్రభుత్వాలు తాము ప్రజలకు ఇచ్చే సేవలు, అందిస్తున్న పథకాల మీద తరచుగా సర్వేలు చేయిస్తూ ఉంటాయి. దాని బట్టి ప్రజల స్పందన, పథకాలు అమలు తీరుతెన్నులు వంటి విషయాలలో ప్రభుత్వానికి ఒక అవగాహన వస్తుంది. దీని బట్టే ప్రభుత్వం మీద ఉన్న సానుకూలత, వ్యతిరేకతలను కూడా అర్ధం చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వ చేసే సర్వేలలో సహజంగా కొంత మేర ప్రభుత్వ అనుకూలతను అధికారులు ఎక్కువ చేసి చూపిస్తూ ఉంటారు.
బహుశా స్వామిభక్తి కావొచ్చు మరేదైనా కారణం కావొచ్చు. తాజాగా ముఖ్యమంత్రి జగన్ స్పందన కార్యక్రమంపై సమీక్ష చేసిన సందర్భంలో ఆ కార్యక్రమంపై చేసిన సర్వే వివరాలు ప్రకటించారు. స్పందనలో సమస్యలు పరిష్కరించుకున్న వారిలో 59 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారని, మిగిలిన 41 శాతం మంది మరింత మెరుగ్గా సమస్యలను పరిష్కరించవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వ సర్వేలోనే ఫలితాలు ఇంత తక్కువగా ఉంటున్నాయి అంటే ఆశ్చర్యమే.
ప్రైవేట్ గా చేసే సర్వేలలో ఇది మరింత తక్కువ వస్తుంది. అందుకే ఇది ప్రమాదకరం. అయితే ఈ సర్వే ప్రభుత్వ పథకాల మీద కాబట్టి అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే అధికారుల పనితీరు కూడా ప్రభుత్వం మీద ప్రభావం చూపిస్తుంది. 41% మంది సంతృప్తి చెందలేదు అంటే అది ఖచ్చితంగా అధికారుల పని తీరు బాలేదనే చెబుతుంది. దీనిని ముఖ్యమంత్రి, సదరు మంత్రులు సీరియస్ గా తీసుకోవడం ఎంతైనా మంచిదే.